రైలుకు 25 బోగీలుండొద్దా?: హైకోర్టు ప్రశ్న, విద్యుత్ ఛార్జీల మోతలు, చేనేత కార్మికులపై..
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సోమవారం పలు కీలక అంశాలపై విచారణ చేపట్టింది. వలస కూలీలను తరలించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే.. వలస కూలీల కోసం ఎందుకు ఎక్కువ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది.

రైలుకు 25 బోగీలుండొద్దా?
బీహార్కు చెందిన 45 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్ తెలిపారు. బీహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు నిలదీసింది. ప్యాసింజర్ రైలుకు 24 బోగీలే ఉంటాయని, అదనంగా ఏర్పాటు చేయకూడదని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. దీంతో అదనపు బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని హైకోర్టు మండిపడింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. కాగా, అదనపు బోగీలను రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని రైల్వే శాఖ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే.. రైల్వేను తానే కోరతానని ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ మంగళవారం విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

విద్యుత్ బిల్లుల మాఫీ..
ఇది ఇలా ఉండగా, లాక్డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు సాధారణం కన్నా అధికంగా వచ్చాయనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ నరేశ్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్పీడీసీఎల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అత్యధికంగా బిల్లులు
కాగా, విద్యుత్ బిల్లులు సాధారణం కన్నా ఎక్కువగా వచ్చాయని హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. స్లాబులు సవరించి బిల్లులు తగ్గించాలనే వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కమిటీకి 6767 ఫిర్యాదులు రాగా, ఇప్పటి వరకు 6678 పరిష్కరించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు.
Recommended Video

చేనేత కార్మికులపై హైకోర్టు..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 200 కోట్ల చేనేత ముడి సరుకు కార్మికుల వద్ద ఉందని, దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోర్టుకు తెలిపారు.
కాగా, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రీప్లై కౌంటర్ వేస్తామన్న పిటిషన్ తరపు న్యాయవాది.. 10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. హైకోర్టు జులై 2కు తదుపరి విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications