ర్యాలీ ఆదివారం నిర్వహించుకోండి: జేఏసీకి హైకోర్టు, సభా వేదిక మార్పు
నిరుద్యోగ ర్యాలీకి అనుమతి పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా...
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీకి అనుమతి పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని... అయితే ర్యాలీని రేపు కాకుండా ఆదివారం నిర్వహించుకోవాలని కోర్టు తెలంగాణ జేఏసీకి సూచించింది.
నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించే ప్రమాదం ఉందని.. అందువల్ల నగర శివారుల్లో తాము సూచించిన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.
ఈ ర్యాలీకి భారీ ఎత్తున జన సమీకరణ జరిగిందని.. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడులో జల్లికట్టు తరహాలో జనాన్ని సమీకరిస్తున్నట్లు తెలుస్తోందని పోలీసులకు హైకోర్టు నివేదించారు. శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి షరతులతో అనుమతిచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆదివారం సభ, ర్యాలీ నిర్వహించుకునేందుకు మీకేం అభ్యంతరమని కోర్టు ప్రశ్నించింది. దీనిపై విచారణను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది.
కాగా, తాము సభను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించుకుంటామని జేఏసీ కోర్టుకు తెలిపింది. అయితే, మరోసారి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని జేఏసీకి కోర్టు సూచించింది. దీంతో ర్యాలీ, సభ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.