21 తేదీలోగా ఆస్తుల లెక్క చెప్పండి: బెజవాడలోని 7 ఆస్తుల అమ్మకానికి పచ్చజెండా
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు సోమవారం పచ్చజెండా ఊపింది. ఈ నెల 21వ తేదీ లోగా ఆస్తుల తొలి దశ వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న 7 ఆస్తులను అమ్మాలని హైకోర్టు సూచించింది.
ఆస్తుల మార్కెట్ విలువను వచ్చే 21వ తేదీన హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 28వ తేదీన పత్రికా ప్రకటన విడుదల చేయాలని, 19వ తేదీన ఓపెన్ బెట్టింగ్ చేపట్టాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
డిసెంబర్ 21వ తేదీన తొలి దశ అమ్మకాలు జరపాలని చెప్పింది. కాగా, అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం జరగాలని ఈ సందర్భంగా మొరపెట్టుకున్నారు.
మరోవైపు, హైకోర్టులో ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ కూడా జరిగింది. కేసు విచారణను న్యాయస్థానం రేపటికి (మంగళవారానికి) వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబు పాత్ర పైన విచారించారని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే.