మున్సిపోల్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు ప్రశ్నల వర్షం ... విచారణ శుక్రవారానికి వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ల విచారణలో నేడు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే పురపాలక ఎన్నికలను ఐదు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన హైకోర్టు, ఎన్నికల నిర్వహణకు తక్షణమే ఏర్పాట్లు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక నేడు జరిగిన విచారణలో పలు కీలక అంశాలపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

గతంలో ఎన్నికలకు 5 నెలల గడువు కోరిన ప్రభుత్వం .. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమని హైకోర్టుకు విన్నపం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.రాష్ట్ర ఎన్నికల సంఘం తో పాటుగా మరో ఇద్దరు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటీషన్లపై గత కొంతకాలంగా ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే గతంలో తమకు 5నెలల గడువు కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, అనుమతిస్తే ఎన్నికలు నిర్వహిస్తామని హై కోర్టుకు విన్నవించింది తెలంగాణ ప్రభుత్వం.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవాంతరాలన్నీ పరిష్కరించామన్న ప్రభుత్వం
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిపూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలపై విధించిన స్టే కు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించినట్టుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.హైకోర్టు ఆదేశిస్తే అన్ని మున్నిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఇకకోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.

మున్సిపోల్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు ప్రశ్నలు .. శుక్రవారానికి విచారణ వాయిదా
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై హైకోర్టు నేడు జరిగిన విచారణలో సీరియస్ అయ్యింది . ఇక నేడు జరిగిన విచారణలో ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి 109 రోజుల సమయం అడిగిన ప్రభుత్వం ఇప్పుడు 8 రోజుల కు ఎలా కుదిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికల కు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హైకోర్టు ధర్మాసనానికి తెలిపినతెలిపిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావును ఏ ప్రాతిపదికన వార్డుల విభజన ,రిజర్వేషన్ల ప్రక్రియ చేసారని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది వార్డుల విభన,రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం జీవో నెంబర్ 78 ద్వారాపూర్తి చేశామని సమాధానం చెప్పారు. అంతే కాదు పాత ఆర్డినెన్స్ ద్వారానే మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం .అయితే తెలంగాణ ప్రభుత్వం నూతన ఆర్డీనెన్స్ తీసుకొచిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది ఆ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళారు.ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్ వివరాలు కోర్టుకు తెలపాలని ప్రభుత్వానికిహైకోర్టు ఆదేశం జారీ చేసింది. శుక్రవారం నూతన ఆర్డినెన్స్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుహైకోర్టు ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications