నాకు ముందే తెలుసు: కేసీఆర్కు షాక్పై కోదండ, సంబరాలు చేసుకున్నారు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి జీవో 123పై చుక్కెదురు కావడంపై కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంది. గాంధీ భవన్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ తీరు పైన, 123 జీవో పైన నిప్పులు చెరిగారు. 123 జీవో వల్ల ప్రభుత్వానికి, దళారులకే లాభమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. హైకోర్టు తీర్పు రైతుల విజయమని చెప్పారు.
రైతుల పక్షాన తీర్పు ఇచ్చినందుకు డివిజన్ బెంచ్కు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. హైకోర్టు తీర్పు పైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు స్పందించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు.
డీకే అరుణ
హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం బేషజాలు పక్కన పెట్టి, 2013 చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. హైకోర్టు తీర్పు నిర్వాసితుల విజయమన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు మనుగడ సాధించలేవన్నారు.
జగ్గారెడ్డి
తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి హైకోర్టు తీర్పు చెంప పెట్టు అని జగ్గారెడ్డి అన్నారు. న్యాయస్థానం రైతులను కాపాడే విధంగా తీర్పు ఇచ్చిందన్నారు. తాము రైతులకు న్యాయం చేయాలని పోరాడామన్నారు.
దామోదర రాజనర్సింహ
తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, కానీ రైతులకు సరైన పరిహారం ఇవ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
కోదండరాం
బలవంతపు భూసేకరణకు సాధనంగా ప్రభుత్వం 123 జీవోను ఉపయోగించుకుందని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా జీవోలు తీసుకు వస్తే ఏదో ఒకరోజు ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
రఘునందన రావు
హైకోర్టు తీర్పు రైతుల విజయమని బీజేపీ నేత రఘునందన రావు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. హైకోర్టు తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు సేకరించిన భూమిని వెనక్కి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మోత్కుపల్లి
2013 చట్టం ఉండగా, తెలంగాణ ప్రభుత్వం జీవో 123 తీసుకు రావడం విడ్డూరమని టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం సరికాదన్నారు.