హైడ్రామా: ఫిలింనగర్ లో పిజెఆర్ విగ్రహం తొలగింపు, విజయారెడ్డి అరెస్టు
అనుమతి లేకుండానే ఫిలింనగర్ లో పిజెఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో ఆ విగ్రహన్ని జిహెచ్ ఎం సి అధికారులు తొలగించారు.అయితే విగ్రహం తొలగింపును ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి అడ్డుకొన్నారు.
హైద్రాబాద్ :ఫిలింనగర్ లో హైడ్రామా చోటుచేసుకొంది.అనుమతి లేకుండా దివంగత పిజెఆర్ విగ్రహం ఏర్పాటుచేయడంతో మున్సిఫల్ శాఖాధికారులు ఆ విగ్రహన్ని తొలగించారు. విగ్రహం తొలగింపును నిరసిస్తూ పిజెఆర్ అభిమానులు, కార్పోరేటర్ విజయారెడ్డి , ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు.దీంతో హైడ్రామా సాగింది. కార్పోరేటర్ విజయారెడ్డిని అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైద్రాబాద్ నగరంలోని ఫిలింనగర్ లో మాజీ మంత్రి , దివంగత పిజెఆర్ విగ్రహం ఏర్పాటుకు ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం షేక్ పేట డివిజన్ పరిధిలోకి వస్తోందని విగ్రహం ఏర్పాటుకు అనుమతుల్లేవని మున్సిఫల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి ఆందోళనకు దిగారు. ఫిలింనగర్ వద్దే భైఠాయించారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతిచ్చేవరకు ఆందోళన సాగిస్తానని ఆమె హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పినా ఆమె వినలేదు. దీంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆమెను , ఆమె అనుచరులను అరెస్టుచేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఈ విగ్రహన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని చదునుచేశారు పోలీసులు. అక్కడే పోలీస్ పికెట్ ను ఏర్పాటుచేశారు. జిహెచ్ ఎం సి అధికారులు కార్పోరేటర్ విజయారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వంత పూచీకత్తుపై విడుదలైన విజయారెడ్డి విగ్రహం తొలగించిన చోటే పిజెఆర్ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు.