వేధింపులు నిజమే, ఆత్మహత్యకు సిద్ధపడ్డ మరో ఎస్సై, మంత్రి ఎదుటే లబోదిబో!
పోలీసుశాఖలో వేధింపులు నిజమేనని ఆ శాఖలో పలువురు అధికారులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు.
హైదరాబాద్: పోలీసుశాఖలో వేధింపులు నిజమేనని ఆ శాఖలో పలువురు అధికారులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారంటూ ఓ ఎస్సై ఏకంగా మంత్రి హరీశ్ రావు ఎదుటే ఘెల్లుమనడం దీనికి మరింత బలం చేకూరుస్తుంది.
కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు జరిగిన సంఘటన ఇది. ఆరోజు మంగళవారం.. మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకుల కుంటలోని మల్లికార్జునస్వామి ఆలయానికి విచ్చేశారు.

ఆ సమయంలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎస్సై మంత్రి హరీశ్ రావును కలిసి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సదరు ఎస్సై దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సన్నిహితుడు.
ఉన్నతాధికారుల నుంచి తానెదుర్కొంటున్న ఇబ్బందులను సదరు ఎస్సై తొలుత ఎమ్మెల్యే రామలింగారెడ్డికే చెప్పుకుని వాపోయాడట. ఆయన సూచన మేరకు.. దుబ్బాకలో మంత్రి హరీశ్ రావును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
అదేసమయంలో అక్కడికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా రావడంతో.. విషయాన్ని పరిష్కరించాల్సిందిగా మంత్రి హరీశ్ రావు ఆయనకు సూచించారు.
ఇదిలావుండగా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆందోళనతో ఓ ఎస్ఐ ఆత్మహత్యకు సిద్ధపడినట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న సహచర ఎస్ఐలు మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒక్కో ఎస్ఐకి పదుల సంఖ్యలో చార్జ్మెమోలు జారీ కావడం, ప్రతి చిన్నవిషయానికి తీవ్రంగా వేధిస్తుండటంతో ఓ ఉన్నతాధికారి తీరుపై వారంతా విసిగిపోయినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications