హైకోర్టు ఆశ్చర్యం: రోడ్డు దాటుతూ ఆ ఊళ్లో మగవాళ్లంతా మృతి, ఒక్కరే మిగిలారు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్జెర్ల మండలం గొల్లపల్లి పరిధిలోని పెద్దతండాకు చెందిన మగవాళ్లంతా జాతీయ రహదారి దాటుతూ మృతి చెందారనే విషయం తెలిసి హైకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది.పెద్దకుంట తండాలో నివసించే మహిళల పరిస్థితి దీనంగా ఉందని హైకోర్టులో పిల్ దాఖలైంది.
సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్ రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రచన వాదనలు వినిపిస్తూ... ఈ తండాకు వెళ్లాలంటే 44వ జాతీయ రహదారిని దాటాల్సి ఉంటుందన్నారు.
ఈ క్రమంలో గత రెండేళ్లలో 80 మంది పురుషులు ప్రాణాలు విడిచారని, ప్రస్తుతం అక్కడ పురుషుడు ఒక్కడే ఉన్నారని, మిగిలిన వాళ్లంతా మహిళలేనని తెలిపారు. వారి దీనస్థితి పైన బిబిసి సైతం ప్రత్యేక కథనం ప్రసారం చేసిందన్నారు.

ఇది దురదృష్టకరమని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. జాతీయ రహదారి దాటేందుకు సబ్ వే లేదా అండర్ పాస్లను ఎందుకు ఏర్పాటు చేయాలేదని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
అక్కడ సబ్ వే ఉన్నట్లు ఎన్హెచ్ఏఐ మేనేజర్ శైలజ చెప్పారని న్యాయవాది చెప్పారు. దీంతో ఆమెను తదుపరి విచారణకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. సబ్ వే వివరాలు, ఫోటోలు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications