రోడ్డు ప్రమాదం: ఆ రోడ్డులో ఎందుకు, ఎస్సైకి, మహిళా కానిస్టేబుళ్లకు లింక్?
హైదరాబాద్: హైదరాబాదులో సమీపంలోని హిమాయత్సాగర్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగానే మిగిలింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్సైతో సహా ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్ మరణించారు. మరో మహిళా ట్రైనీ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ అప్పాలో శిక్షణ పొందుతున్నారు. ఎస్పై మాత్రం ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అందువల్ల ఆ ఇద్దరు ట్రైనీ కానిస్టేబుళ్లను ఎస్సై ఎక్కడ కలిశాడనేది ప్రశ్నార్థకంగా మారింది
అంతేకాకుండా వాహనాన్ని ఎస్సై ప్రధాన రహదారి గుండా కాకుండా నిర్మానుష్యమైన పిల్లబాట వెంట ఎందుకు నడిపించాడనేది సందేహం వ్యక్తమవుతోంది.
కారు చెట్టును ఢీకొనడంతో....
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఎస్సై, ఇద్దరు మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న కారు శనివారం రాత్రి హిమాయత్సాగర్ సమీపంలో చెట్టును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో అప్పాలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు మమత, కీర్తిలను ఎస్సై మహ్మద్ ఖలీల్ పాషా తన కారులో ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. కారు చెట్టుకు ఢీకొనడంతో ఎస్సై పాషా అక్కడికక్కడే మరణించగా, కీర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
Recommended Video
వారు ఇలా...
ఎస్సై మహ్మద్ ఖలీల్ పాషా (44) వికారాబాదు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్నారు. హైదరాబాదులోని రామంంతపూర్కు చెందిన ట్రైనీ కానిస్టేబుల్ లింంగపల్లి కీర్తి (24), ఆమె స్నేహితురాలు మమత (24) అంబర్పేటలోని పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
శనివారంనాడు
పరీక్ష ముగిసిన తర్వాత ఆగస్టు 21వ తేదీ వరకు సెలవులు ఉండడంతో అకాడమీ నుంచి ట్రైనీలందరూ వెళ్లిపోయారు. కీర్తి, మమత మాత్రం సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉన్నారు. కాగా, ఎస్సై ఖలీల్ సాయంత్రం 3 గంటలకు వికారాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్ నుంచి బయటకు వచ్చాడు. శనివారం ఉదయం ఖలీల్ శంషాబాద్లోని తన ఇంటికి ఫోన్ చేసి తాను వస్తున్నట్లు భార్యకు చెప్పాడు. ఎప్పుడు వస్తున్నాననే విషయం మాత్రం చెప్పలేదు.
ప్రాథమిక విచారణలో ఇలా..
ఇద్దరు మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు హిమాయత్సాగర్ సమీపంలోని ఆలయం వద్ద ఎస్సై కారులో ఎక్కినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడి నుంచి రాజేంద్రనగర్, ఆ తర్వాత అంబర్పేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, హిమాయత్సాగర్ వద్ద కారు చెట్టును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఖలీల్, కీర్తి ప్రమాదంలో మరణించగా మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆె తలకు, కాళ్లకు బలమైన గాయాలు అయినట్లు, శరీరం లోపల కూడా గాయాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు..
సిసిటివీ ఫుటేజీలో....
ముగ్గురు కాల్ డేటాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎస్సై వాహనం పోలీసు అకాడమీకి దరిదాపుల్లో ఉన్న సూచనలేవీ సిసిటీవీ పుటేజీని పరిశీలించగా కనిపించలేదు. 2017లో ఒక్కసారి మాత్రమే ఖలీల్ అధికారికమైన పని మీద పోలీసు అకాడమీకి వచ్చాడు. ఖలీల్కు భార్య, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కుమారుడు, పదో తరగతి చదువుతున్న కూతురు ఉన్నారు.