వెదర్ అప్డేట్: తెలంగాణలో మూడురోజుల పాటు భగ్గుమననున్న సూర్యుడు
రాజస్థాన్ నుంచి వీస్తున్న వడగాలులు తెలంగాణను తాకాయి. వేడి గాలులు మధ్యప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీని ప్రభావం మూడురోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్లో 33.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా... రామగుండంలో 34.8డిగ్రీలు, నిజామాబాద్లో 34 డిగ్రీలు, హన్మకొండలో 34 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఇక రానున్న 72 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని తెలిపింది వాతావరణశాఖ. ఇక మూడురోజులు గడిచాక వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అది కూడా అరేబియన్ సముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

మధ్య మధ్యప్రదేశ్లో గాలులు సవ్యదిశలో తిరుగుతున్నాయని అదే సమయంలో ఎక్కువగా వేడితో కూడిన వాయువ్య గాలులుకూడా చురుగ్గా కదులుతున్నాయని స్కైమెట్ ఛీఫ్ మహేష్ పలావత్ చెప్పారు. ఈ గాలులు రాజస్థాన్లో మొదలై మధ్యప్రదేశ్ మీదుగా తెలంగాణ వరకు వీస్తున్నాయని ఆయన చెప్పారు.ఇక రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ తాకుతున్నాయని చెప్పారు. ఇక మధ్యభారతంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి మరో మూడురోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత ఆగ్నేయ అరేబియన్ సముద్రంలో చోటుచేసుకోబోయే అల్పపీడనంపై వాతావరణం ఆధారపడి ఉంటుందని చెప్పారు మహేష్.
ఇదిలా ఉంటే నైరుతి పవనాలు తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో బలహీనపడ్డాయి. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఇందుకు కారణం నైరుతి పవనాలు ఈశాన్య దిశగా కదులుతుండటమేనని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని సమాచారం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ నగరంలో పగలు పూట వాతావరణం పొడిగా ఉండి... సాయంత్రం రాత్రి వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యే అవకాశం ఉండగా రాత్రి వేళల్లో టెంపరేచర్స్ 22 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశముంది.












Click it and Unblock the Notifications