సకుటుంబ సపరివార సమేతంగా .. హుజురాబాద్ లో అభ్యర్థుల కుటుంబాల ఎన్నికల ప్రచారం ఆసక్తికరం!!
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టి హుజురాబాద్ నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ ఖాతాలో వేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ ఉపేన్నికతో కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్నారు

హోరాహోరీగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్.. గెల్లు కోసం ప్రచారంలో ఆయన సతీమణి
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుండి, హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ నుండి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుండి హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన యువ నాయకుడు, టిఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలే కాకుండా ఆయన సతీమణి గెల్లు శ్వేత యాదవ్ ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగారు.

తెలంగాణా కోసం పోరాటం చేసిన గెల్లుకు ఓటెయ్యాలని భార్య విజ్ఞప్తి
20 ఏళ్లుగా తన భర్త విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాటం సాగించాడని, పేదింటి ఉద్యమకారుడని ఏనాడు ఏ పదవి ఆశించకుండా పని చేశాడని, తన భర్తను గెలిపించాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేతా యాదవ్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తన భర్త శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కూడా పాటుపడతారని శ్వేత యాదవ్ ప్రచారం చేస్తున్నారు. తన భర్త చాలా నిజాయితీపరుడు అని, గెలిపించాలని కోరుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో దూకుడు మీదున్న బీజేపీ
ఇక బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగి సీఎం కేసీఆర్ తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ప్రజలంతా తన వెంటే ఉన్నారని బిజెపి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దొరల అహంకారం అణచడానికి, తెలంగాణా ఆత్మ గౌరవం కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బండి సంజయ్ కూడా హుజురాబాద్ ను బీజేపీ ఖాతాలో వెయ్యటం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపనున్నారు. బండి సంజయ్ తెలంగాణా అసెంబ్లీ లో ఆర్ఆర్ఆర్ రంగంలోకి దిగుతారని,రఘునందన్, రాజేందర్, రాజా సింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కోసం బీజేపీ సీనియర్ నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారం పర్వాన్ని హోరెత్తిస్తున్నారు.

ఈటల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి ఈటల జమున
ఇదే సమయంలో ఈటల రాజేందర్ తరపున ఎన్నికల ప్రచారానికి బరిలోకి దిగారు ఆయన సతీమణి ఈటల జమున. హుజూరాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న ఈటల జమున హుజురాబాద్ కు వస్తున్న ప్రతి పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కు ఓటేసి గెలిపించాలని, తడి గుడ్డతో గొంతులు కోసే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని జమున ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులను పేర్కొన్న ఆమె, డబ్బుకు అమ్ముడు పోయే వారు కాదని అంటున్నారు. దొరల అహంకారానికి బుద్ధి చెప్పడానికి తన భర్త ఈటల రాజేందర్ కు ఓటేసి గెలిపించాలని ఈటల జమున విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ అభ్యర్థి బలమూర్ వెంకట్
కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన యువ నాయకుడు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బలమూర్ వెంకట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందరికంటే ఆఖరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఓటు బ్యాంకు కోసం వెంకట్ బాగానే కష్టపడుతున్నాడు. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వెంకట్ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది విద్యార్థులు నిరుద్యోగుల కోసమని కానీ నేడు వారికి అన్యాయం జరుగుతుందని వెంకట్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ లో భాగంగా తనకు హుజురాబాద్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని వెంకట్ చెప్పారు. ఇక వెంకట్ తరఫున ఆయన తల్లి బలమూర్ పద్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

వెంకట్ కోసం ఎన్నికల ప్రచారంలో ఆయన తల్లి
ఈనెల 8వ తేదీ నుండి తన కుమారుడి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా యువకులు ఎంతో మంది బాధపడుతున్నారని ప్రభుత్వ వైఖరిని ప్రతి తల్లికి, తండ్రికి తెలిసేలాగా ప్రచారం చేస్తానని వెంకట్ తల్లి పద్మ చెప్తున్నారు. తన బిడ్డ విజయానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్న పద్మ శుక్రవారం నుండి నుంచి ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో ప్రధాన పార్టీ అభ్యర్థుల కోసం వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ప్రచారం నిర్వహించడం ఆసక్తికరంగా మారుతోంది. సకుటుంబ సపరివార సమేతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఓటర్ల మనసు గెలుచుకునే కుటుంబం ఏది అనేది ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications