హుజురాబాద్ పోరు: గెల్లు విజయం కోసం రంగంలోకి.. 20 మంది టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటుంది. నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుండి ప్రారంభం కాగా ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక పాలిటిక్స్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలమూర్ వెంకట్ ; గెల్లుకు పోటీగా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు?
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. హుజురాబాద్ లో వార్ పీక్స్
హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్, భూ ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుండి తొలగించబడ్డారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటల రాజేందర్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బిజెపి నుండి ఈటల రాజేందర్ తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఎన్నికల బరిలోకి దిగారు. ఈటల రాజేందర్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలను ఓడించాలని గట్టిగా సంకల్పించిన సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారు.
హుజురాబాద్ నియోజక వర్గంపై సీఎం ఫోకస్ .. అభివృద్ధికి పెద్ద పీట
ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఎన్నికల బరిలోకి దిగానని, తనను ఆదరించాలని ప్రచారం చేస్తుంటే, అధికార టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత వ్యూహాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించిన కేసీఆర్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. నిధుల వరద కురిపించారు. ఈ అభివృద్ధిని చూసే తమను గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న టీఆర్ఎస్
ఇదిలా ఉంటే అభ్యర్థిని ప్రకటించడంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ టిఆర్ఎస్ పార్టీ ముందు నుండి దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇక తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించడంకోసం స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దింపటానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే 20 మంది నేతల పేర్లను టిఆర్ఎస్ పార్టీ సమర్పించింది.
ఈసీకి 20 మంది స్టార్ క్యాంపెయినర్ ల జాబితా .. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
ఇక టిఆర్ఎస్ పార్టీ తరఫున హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ లుగా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సుంకే రవిశంకర్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ విజయ, ఇనుగుల పెద్దిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి లు ఉన్నారు. వీరంతా ఇక నుండి ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు. ఇప్పటికే అధికార టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే ఉంది.
హుజురాబాద్ నియోజక వర్గంలో అమల్లో ఎన్నికల కోడ్
ఇప్పుడు మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగించాలని టిఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గం హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ నియోజకవర్గం విస్తరించి ఉన్నందున, రెండు జిల్లాల్లోనూ కార్పొరేషన్ పరిధి ఉన్నందున కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.