అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడు; ఈటలను ఓడించటానికి వందల కోట్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన నేతలందరూ దూసుకు పోతున్నారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార పర్వంలో దూకుడు పెంచిన బీజేపీ ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు బండి సంజయ్, ఎంపీ అరవింద్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి తదితరులు ఈటల రాజేందర్ కోసం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. కేసీఆర్ పై ఫైర్
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేటలో ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారం చేసిన కిషన్ రెడ్డి అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడు అంటూ విమర్శించారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి కెసిఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని, బిజెపికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నే అని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం బిజెపి చేసుకుందన్న టిఆర్ఎస్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

గ్యాస్ ధరల పెంపుపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
ఇప్పటివరకు ఎప్పుడూ ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తాను చూడలేదని పేర్కొన్న కిషన్ రెడ్డి లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం, సంకుచిత రాజకీయాలు చేయడం ఒక్క టీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్యాస్ ధర పెంపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండదని ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి గ్యాస్ ధరలు పెరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై బీజేపీదే బాధ్యత అని చెబుతున్న టిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పుడు ప్రచారం అని తేల్చి పారేశారు. ప్రజలపై భారం పడకుండా ధరలు తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

డబ్బులనే నమ్ముకుని ఎన్నికలకు కేసీఆర్ వెళ్తున్నాడు
కేవలం డబ్బులను మాత్రమే నమ్ముకొని కేసీఆర్ ఎన్నికలకు వెళుతున్నారని పేర్కొన్న కిషన్ రెడ్డి, కెసిఆర్ గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీఎం కుర్చీని వదిలిపెట్టడం లేదని, అసలు కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నోరు తెరిస్తే కేసీఆర్ అబద్ధమే చెప్తాడన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ఏడేళ్ళు అయినా చేశాడా అంటూ ప్రశ్నించారు. దళితులెవ్వరూ సీఎం కేసీఆర్ ను నమ్మొద్దని అన్నారు.
Recommended Video

దళిత బంధు పథకంపై తప్పుడు ప్రచారం .. దమ్ముంటే ఎన్నికల తెల్లారి అమలు చెయ్
దళిత బంధు ఆపేయించేశారని బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల అయిన తెల్లారి అందరికీ దళిత బంధు పథకం అమలు చెయ్యాలని మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్ నిజ స్వరూపం బయట పడిందన్న మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ తెలంగాణా ద్రోహి అని ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ను గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications