పాదయాత్రలో ఈటలకు పెద్ద చిక్కు ... బీజేపీతోనే తలనొప్పి .. హుజూరాబాద్ ఎన్నికలపై అంతర్మధనం !!
బయటకు గంభీరంగా మాట్లాడుతున్నా హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఈటల రాజేందర్ అంతర్మధనానికి గురవుతున్నారా ? ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో బీజేపీ వల్ల కొత్త తలనొప్పులు ఫేస్ చేస్తున్నారా ? మొదటి నుండి టిఆర్ఎస్ పార్టీ నేతగా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడైన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ గులాబీ నేత మార్క్ పోగొట్టుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు.
ఈటలపై అభిమానం చూపిస్తున్న ప్రజలు .. కానీ కన్ఫ్యూజన్
సీఎం కేసీఆర్ తో విభేదించి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ లో తెలంగాణా ఆత్మగౌరవాన్ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్రలో అడుగడుగునా ఈటల రాజేందర్ ను ప్రజలు ఆదరిస్తున్నా, మీ పట్ల మాకు అభిమానం ఉంది మా ఓటు నీకే అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నా కారు గుర్తును గెలిపిస్తాం సారు అంటూ చెప్పడం ఈటల రాజేందర్ ను షాకు కు గురిచేస్తుంది.
మొదట నుండి టీఆర్ఎస్ పార్టీలో ఈటల ..క్షేత్ర స్థాయిలో కారు సింబల్
పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఈటల రాజేందర్ కు ఇలాంటి అనుభవాలు అవుతున్నట్టు సమాచారం. మొదటినుంచి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉండటంవల్ల ఈటెల రాజేందర్ అంటే కారు గుర్తు అని గ్రామీణ స్థాయిలో ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈటల రాజేందర్ బిజెపికి మారినప్పటికీ చాలా మంది ప్రజలు అది గుర్తించటం లేదు. కారు గుర్తు మాత్రం మర్చిపోవడం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడంతో ఆయన ఇప్పుడు కమలం గుర్తును గట్టిగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళాల్సి వస్తోంది.
అభిమానం ఉన్నా గుర్తు గందరగోళంపై అనుమానం
తనను అభిమానించే ప్రజలు కమలం గుర్తు కాకుండా కారు గుర్తుకు ఓటు వేస్తారేమో అన్న మీమాంస ఈటల రాజేందర్ కు పెద్ద ఇబ్బందిగా తయారైంది. తెలంగాణ ఉద్యమం నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో రెండు పర్యాయాలుగా మంత్రిగా కొనసాగడం వల్ల ఈటల రాజేందర్ ను గులాబీ పార్టీ నేత గానే ప్రజలు గుర్తుంచుకున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ రాజీనామా చేసి బిజెపి బాట పట్టినా, రాజకీయాలపై పెద్దగా దృష్టి సారించని గ్రామీణ ప్రాంత ప్రజలు కొందరు మా ఓటు మీకే వేస్తామని చెబుతూనే కారు గుర్తును గెలిపిస్తాం అని చెబుతున్నారని సమాచారం.
కమలం గుర్తు ప్రజల్లోకి తీసుకెళ్లటం ఈటల ముందున్న పెద్ద పని
ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కు ఇప్పుడు బీజేపీ గుర్తు అయిన కమలం గుర్తు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం పెద్ద పనిగా మారింది.హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, పాదయాత్ర చేస్తున్న ప్రతి చోట ఆయన కమలం గుర్తు ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెసిఆర్ కేటీఆర్ వ్యూహాలు, నియోజకవర్గంలో మంత్రుల ప్రచారాలు, హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలు అటుంచితే, ఇప్పుడు పార్టీ సింబల్ ఈటెల రాజేందర్ కు సమస్య తెచ్చిపెట్టింది.
Recommended Video
సింబల్ సమస్య ఈటలను ఏం చేస్తుందో?
బిజెపి క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం, కమలం గుర్తు ను ప్రచారం చేసుకోవాల్సి రావడమే అందుకు కారణం. ఏది ఏమైనా రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్ అన్న కమలం నేతగా గుర్తించి ఓటర్లు ఓట్లు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే సమస్య ఈటెల రాజేందర్ అంతర్మధనానికి కారణంగా మారిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.