ఎన్నారైని మోసం చేసిన అంబర్పేట సీఐ సుధాకర్ అరెస్ట్: లంచం తీసుకుంటూ ఎస్ఐ
హైదరాబాద్: నగరంలోని అంబర్పేట సీఐ సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ను రిమాండ్ కు తరలించనున్నారు.
వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 50 లక్షలకు ఇప్పిస్తానన్న సుధాకర్.. ఓ ప్రవాస భారతీయుడు(ఎన్నారై)కి చెప్పాడు. దీంతో అతను సుధాకర్ ను నమ్మి పలు దఫాల్లో రూ. 50 లక్షలు ఇచ్చాడు. అయితే, ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్ కు గురైన రాజేశ్ ను ఎమ్మార్వోగా ఎన్నారైకి పరిచయం చేశాడు సుధాకర్.
రాజేశ్.. భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మించాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ.. లాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్నారై.. తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు అందించాడు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో.. సుధాకర్, రాజేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ
బహదూర్పురా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ పౌరుడి నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తి ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే తన ఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని బాధిత వ్యక్తి ఎస్ఐ శ్రవణ్ కుమార్ను సంప్రదించాడు. ఈ క్రమంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్ఐ రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.