దొరికారో అంతే.. న్యూ ఇయర్ పార్టీస్ పై సీపీ సజ్జనార్ వార్నింగ్!
నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్నాయి. అప్పుడే జనాలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఇప్పటినుంచే ప్లాన్స్ తో యువత ముందుకు వెళుతున్నారు. ఈవెంట్స్ నిర్వాహకులు ఈవెంట్స్ ప్లాన్ లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ సీపీ హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే కొత్త సంవత్సర వేడుకలలో సంతోషం ఉండబోదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిర్వాహకులు, ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇక నేటి నుండి డ్రంక్ అండ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

నేటి నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ పైన నగర పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నగరం నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ 100 ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను కఠినంగా నిర్వహిస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు.
ఈవెంట్స్ చేసేవారు ఇవి తప్పనిసరి
ఈవెంట్ నిర్వాహకులు కార్యక్రమాలు జరిగే ప్రాంతాలలో తప్పనిసరిగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని, పార్టీల నిర్వహణకు ఆన్లైన్లో పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో సౌండ్ సిస్టం లు, లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటలకల్లా ఆఫ్ చేయాలని సజ్జనార్ ఆదేశించారు.
15 షీ టీమ్స్ రంగంలోకి
నూతన సంవత్సర వేడుకల భద్రత పర్యవేక్షణ పైన కమిషనర్ క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మఫ్టీలో 15 షీ టీమ్స్ దళాలు గస్తీ నిర్వహిస్తాయి అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ముఖ్యంగా యువత పోలీసుల సూచనలు పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరి న్యూ ఇయర్ జోష్ లో ఉన్న యూత్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు ఒకసారి పరిగణనలోకి తీసుకోండి.












Click it and Unblock the Notifications