ప్రశ్నిస్తే గుండు కొట్టించాడు: నయీంతో హైదరాబాద్ మాజీ మంత్రి లింకులు
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ కాల్పుల్లో మరణించిన గ్యాంగస్టర్ నయీంకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. వాస్తవాలు, ఊహాగానాలు కలగలిసి ప్రచారం సాగుతున్నట్లు కనిపిస్తోంది.
బాలికలపై నయీమ్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని విచారణలో నిందితులు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం.. ఆడపిల్లలు ప్రతిఘటిస్తే చితకబాది మరీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి బాలికలను వేధించేవాడని చెబుతున్నారు.
నయీం ఖాతాలో చాలా మందే బాధితులు ఉన్నారు. అయితే అప్పట్లో నయీమ్ అరాచకాలను ప్రశ్నించినందుకుగాను ఫర్హానకు గుండు కొట్టించాడని అంటున్నారు. నన్నే ప్రశ్నిస్తావా.. ఏమనుకుంటున్నావ్ అంటూ ఆమెను కొట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని సమాచారం.
బాలికలెవరైనా నయీం వికృత చేష్టలకు ఎదురుతిరిగితే వారిని చంపేసేవాడని పర్హానా చెప్పినట్లు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులెవరూ నయీంను ప్రశ్నించడానికి సాహసించేవారు కాదని అంటున్నారు. బాలికలను తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రప్పించుకునేవాడని చెబుతున్నారు.
మాజీ మంత్రితో లింకులు
కాగా, నల్లగొండ జిల్లా మాజీ మంత్రితో నయీంకు సంబంధాలున్నాయనే ప్రచారం వేడి తగ్గక ముందే మరో మాజీ మంత్రితో లింకులంటూ వార్తలు వస్తున్నాయి. హైదరాబాదుకు చెందిన ఓ మాజీ మంత్రి అతనితో సంబంధాలు నెరిపినట్లు చెబుతున్నారు. ఆ మాజీ మంత్రి పలు పార్టీలు మారాడని, అతను హైదరాబాదు శివార్లలో భూదందాలు నడిపేవాడని చెబుతున్నారు.
ఈటెల సంచలన ప్రకటన...
నయీం, మోహన్ రెడ్డి సంబంధాలపై కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతున్న సమయంలోనే జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. గురువారం గోదావరి ఖనిలో జరిగిన ఓ సభలో ఈటెల ఘాటు హెచ్చరికలు చేశారు. రౌడీయిజాన్ని, గూండాగిరిని సహించేది లేదని తేల్చిచెప్పారు. అరాచకాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదన్నారు.