1000 కోట్ల చైనీయుడి స్కాం: ఓ కంపెనీ డైరెక్టర్గా చిన్న దుకాణదారుడు?
హైదరాబాద్: ఇటీవల ఢిల్లీలో ఓ చైనా జాతీయుడిని ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించే కొద్ది జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. గత వారం ఢిల్లీలోని లూ సాంగ్ అలియాస్ పెంగ్ అనే చైనా జాతీయుడిని ఐటీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతను తప్పుడు కంపెనీలు, చిరునామాలు, షేర్లతో భారీ ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. రూ. 1000 కోట్లకుపైగా అతడు మనీలాండరింగ్ చేయడం గమనార్హం.
1000 కోట్ల స్కాం: చైనా జాతీయుడు అరెస్ట్, అన్ని నకిలీవే, భారత యువతిని మోసం చేసి పెళ్లి
చైనాయులతోపాటు భారతీయులు కూడా..
కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు లూ సాంగ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ రాకెట్లో చైనీయులతోపాటు కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సాంగ్ అనే ఈ చైనాయుడు చైనా కోసం ఇక్కడ రహస్యాలను సేకరిస్తున్నట్లు గుర్తించారు. గ్రోయింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లి కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యూన్ టెక్నాలజీ, డైసీ లింక్ ఫైనాన్షియల్, హువాహూ ఫైనాన్షియల్ సంస్తలు ఆన్ లైన్ గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. గురుగ్రాంకు చెందిన రాహుల్ ముంజాల్, ధీరజ్ సర్కారు, చైనాకు చెందిన లిన్ యాంగ్, మింగ్ యాంగ్, జింగ్ లింగ్ వాంగ్, ఢిల్లీకి చెందిన నీరజ్ కుమార్ తులి లను ఆయా సంస్తల డైరెక్టర్లుగా గుర్తించినట్లు తెలిపారు.
30 కోట్ల సీజ్.. యువత టార్గెట్గా ..
అంతేగాక, ఓ బ్యాంకులో వీటికి సంబంధించిన ఖాతాల్లోని రూ. 30 కోట్లను సీజ్ చేశామని తెలిపారు వీటికి సంబంధించిన వెబ్సైట్లు చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటి డేటా బేస్ క్లౌడ్లో ఉందని వివరించారు. ఈ సైట్లలో బెట్టింగ్ కు పాల్పడుతూ యువత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని కమిషనర్ తెలిపారు. చాలా మంది ఈ ఆన్లైన్ గేమింగ్లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ చైనా సైట్లు భారత్కు చెందిన స్థానిక గేమింగ్ ను ఆధారంగా చేసుకుని మూడు ముక్కలాట, లోన-బయట, ఇండియన్ రమ్మీ వంటి ఆటలతో యువతకు గాలం వేస్తున్నాయని సీపీ తెలిపారు.
ఓ కంపెనీ డైరెక్టర్గా చిన్న దుకాణదారుడు..
కాగా, అరెస్టైన నీరజ్ కుమార్ తులి అనే వ్యక్తి మాత్రం తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని అంటున్నాడు. తాను ఢిల్లీ కోరల్ బాఘ్ ప్రాంతంలో తన ఇంట్లోనే చిన్న కిరాణ దుకాణం నడుపుకుంటున్నానని, తన పేరున ఓ కంపెనీ కూడా కొనసాగుతోందని తనకు తెలియదని, పోలీసులు తన వద్దకు వచ్చిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. పీ హేమంత్ అనే చార్టెడ్ ఎకౌంటెంట్ తన లెక్కలు చూస్తానంటూ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నాడు.