కూల్చివేతలపై కేసీఆర్కు హైకోర్టు షాక్: ఇంతకాలం ఏం చేశారని నిలదీత
హైదరాబాద్: నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతపై హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అక్రమ కూల్చివేతల తొందరపాటని, జీహెచ్ఎంసీ విధానం సరిగా లేదని హైకోర్టు ఆక్షేపించింది. తమకు నోటీసులివ్వకుండా సొంత స్థలాల్లోని నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారని మటీన్ అహ్మాద్, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించింది.
నోటీసులు ఇవ్వకుండా, కనీసం తమ వాదన వినకుండా కూల్చివేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎమ్.ఎస్ రామంచంద్రరావు ఆక్రమణల తొలగింపు చట్టప్రకారం జరగాలని, అక్రమ కట్టడాల వివరాలన్నీ ఉన్నా ఇన్నాళ్లూ ఎందుకు ఉపేక్షించారని జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు.

హడావుడిగా కూల్చివేతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించడంతోనే హడావుడిగా కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎం స్పందించేదాకా ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించింది. ఆగమేఘాలపై స్పందిస్తున్న తీరు చూస్తే అధికారుల చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన భాస్కర్రెడ్డి
కాగా ప్రభుత్వం తరుపున భాస్కర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు నీట మునగడానికి నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలే కారణమని గుర్తించామన్నారు.

నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటినే తొలగిస్తున్నాం
నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటినే తొలగిస్తున్నామనీ, నాలాలపై నిర్మాణాల వల్ల ఇళ్లల్లోకి నీరు చేరిందని, అటువంటి కట్టడాలను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు. 28వేల ఆక్రమణలు గుర్తించినట్లు ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారనీ, ఇన్నేళ్లుగా ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి మరోసారి ప్రశ్నించారు.

ఆదిలోనే అడ్డుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు
మొదట లోనే అక్రమ కట్టడాలను అడ్డుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వ్యాఖ్యానించారు. బంజారా హిల్స్లోని పిటిషనర్ల తరుపు నిర్మాణాల కూల్చివేతను ఎనిమిది వారాల పాటు ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోర్టు ఆదేశించింది.

452కి చేరిన నిర్మాణాల సంఖ్య
ఇక, సోమవారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో బుధవారం నాటికి కూల్చిన నిర్మాణాల సంఖ్య 452కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నాలాలు, జలాశయాలు కబ్జాచేసి చేపట్టిన నిర్మాణాలతో పాటు, అనుమతులు లేకుండా కట్టినవి, ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.

చర్లపల్లి డివిజన్లో అడ్డుకున్న స్థానికులు
అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు స్థానిక ప్రజాప్రతినిధులనుంచి ప్రతిఘటన తప్పడంలేదు. ముఖ్యంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురంలో మారుతినగర్ నాలా వద్ద ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు వచ్చిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా నాలా వైశాల్యాన్ని గుర్తించి అనంతరం కూల్చివేతలు చేపట్టాలని, పేదల గుడిసెలు తొలగిస్తే ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు.

బంజారా నాలా వెంబడి ఆక్రమణలు కూల్చివేత
అలాగే బంజారాహిల్స్లోని రోడ్ నెం-11లో బంజారా నాలా వెంబడి ఆక్రమణలు కూల్చివేతకు ఉపక్రమించగా, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే కౌసర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని కూల్చివేతలు నిలిపివేయాలని చీఫ్ ఇంజినీర్, సీసీపీని డిమాండ్ చేశారు. అంతేకాదు అక్కడినుంచే స్థానిక డిప్యూటీ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఎమ్మార్వోకు కూడా ఫోన్చేసి కూల్చివేతలు నిలిపి అక్కడినుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.












Click it and Unblock the Notifications