అంతా ఆంధ్రావారి వల్లే, నా ఫాంహౌస్లో అల్లం పండుతుందో లేదో: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రైతు ఆత్మహత్యల పైన చర్చ అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు సమాధానం ఇచ్చారు.
రైతుల రుణమాఫీ చేస్తామని, చెప్పామని అన్నట్లుగా చేస్తున్నామన్నారు. ఇంత పెద్ద పథకాలలో ఎక్కడో ఒకచోట చిన్న లోపాలు ఉంటాయని చెప్పారు. రుణమాఫీ జరుగుతోందన్నారు. రుణమాఫీలో ఎక్కడైనా లోపాలు ఉంటే, చెబితే సరిదిద్దుకుంటామన్నారు. రుణమాఫీ ఒకేసారి చేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
కేంద్రం కొన్ని నిధులు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే.. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయాలనే విషయమై కమిటీ వేశారని, దాని ప్రకారమే మేం పరిహారం ఇచ్చామన్నారు. రైతు కుటుంబాలకు తాము ఇచ్చిన పరిహారంపై పూర్తి వివరాలు అడిగితే ఇస్తామని చెప్పారు.
మేం లక్ష రూపాయల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కానీ, ఒకేసారి వేల కోట్ల రుణమాఫీ కష్టమన్నారు. రూ.ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేయాలనడం ఎంత వరకు సమంజసమన్నారు. భారత దేశంలోనే పత్తి సేకరణలో తెలంగాణ ముందుందన్నారు.
హైదరాబాద్ నగరంలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఇన్ పుట్ సబ్సిడి పూర్తి చేశామన్నారు. ప్రతి మండలంలో గోడౌన్ నిర్మిస్తామన్నారు. 25వేల మెగావాట్ల విద్యుత్ కోసం పనులు జరుగుతున్నాయని చెప్పారు. వ్యవసాయశాఖలో 15వందల పోస్టులు మంజూరు చేస్తున్నామన్నారు.
ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడినవేనని, తాము ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నామని కేసీఆర్ సభలో అన్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల నుంచి విద్యుత్ వరకూ అన్ని విషయాల్లో అన్యాయం జరిగినందునే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
58 ఏళ్ల పాలనలో తెలంగాణ భయంకరమైన వివక్షకు గురైందని, తాము అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయిందన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ను ఆంధ్రప్రదేశ్ఎగ్గొట్టిందని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ అన్నారు. తన ఫాంహౌస్లో తాను పెట్టిన అల్లం కూడా పండుతుందో? లేదో? తెలియని పరిస్థితి ఉందన్నారు. దేశంలోని విత్తన అవసరాలను 60 శాతం మేర హైదరాబాదులోని విత్తన పరిశ్రమలు తీరుస్తున్నాయన్నారు.