నో ఛేంజ్: అసెంబ్లీ, సుల్తాన్ బజార్ల మీదుగానే మెట్రో రైలు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయడం లేదని, పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో పనులు నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో, ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ముందు, సుల్తాన్ బజార్లో మెట్రో పనులు యథాతథంగా జరుగుతున్నాయని చెప్పారు. పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్పై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
దేశంలో ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా నాగోల్ మెట్రో స్టేషనలో ఏర్పాటు చేసిన రిటైల్ షాప్ను గురువారం గాడ్గిల్ ప్రారంభించారు.మెట్రో స్టేషన్లలో విభిన్నమైన రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్నాటికి నగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయని చెప్పారు.
ప్రస్తుతం మియాపూర్-ఎస్ ఆర్నగర్ రూట్లో మెట్రో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేర కే పాతనగరంలో ఫలక్నామా మెట్రో డిపోతోపాటు మెట్రో మార్గం పనులు చేపడుతున్నామని, మూసీ నది మధ్య నుంచి మెట్రో పనులు చేపట్టడం సాంకేతికంగా పలు సవాళ్లతో కూడుకుని ఉందని అన్నారు. నాగోలు- సికింద్రాబాద్ రైల్వే స్టేషన మార్గంలో బోయిగూడ, ఆలుగడ్డబావి, ఎలిఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను వచ్చే ఏడాది నవంబర్నాటికి పూర్తి చేస్తే ఈ మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తాయని చెప్పారు.
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతులు దక్కితే మియాపూర్-ఎస్ ఆర్నగర్ రూట్లలో మెట్రో రైళ్లు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలుంటాయని, అమీర్పేట, గ్రీనల్యాండ్స్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ, విద్యుద్దీపాలు, మంచినీటి పైపులైన్ల మార్పు పనులు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉప్పల్, మియాపూర్ ప్రాంతాల్లో జరిగినంత వేగంగా నగరంలో మెట్రో పనులు జరగకపోవడానికి కారణం అండర్ గ్రౌండ్లో డ్రైనేజీ లైన్స్, పైప్లైన్లే కారణమని వివరించారు.
నాగోల్, మెట్టుగూడ ప్రాంతంలో పనులు పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదన్న ప్రశ్నకు బెంగళూర్, చెన్నై వంటి ప్రాంతాల్లో తక్కువ దూరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే నగరంలో కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. మెట్రో రైల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం, ఎల్అండ్టీ మెట్రో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు లేవని, అనుకున్న సమయంలోనే మెట్రో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తునట్లు తెలిపారు.
హైదరాబాద్ నెక్ట్స్ బ్రాండ్ పేరుతో రియల్ఎస్టేట్, రిటైల్స్టోర్స్ అభివృద్ధిని చేపట్టినట్లు గాడ్గిల్ ప్రకటించారు. ప్రజలకు ఉపయోగపడే మార్గాల్లోనే మెట్రో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించే యోచన చేస్తున్నట్లు వెల్లడించారు. చెన్నై, బెంగళూరు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ ఆపరేషన్స్పై పునరాలోచన చేస్తున్నట్లు గాడ్గిల్ చెప్పారు.
రాజధానిలో మెట్రో రైలు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు సుల్తాన్ బజార్ వ్యాపారులు బంద్ పాటించారు. దీంతో సుల్తాన్ బజారులో 144వ సెక్షన్ విధించారు. సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆందోళన చేస్తున్న వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురి కంటే ఎక్కువగా ఉండి గుంపులుగా తిరగవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, మెట్రో రైలు అలైన్మెంట్ మార్చకుంటే తాము రోడ్డున పడతామని సుల్తాన్ బజార్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.