తల్లి నేర్పిన దొంగ పాఠాలు: కొడుకులను జైలుపాలు చేశాయి, కిలోన్నర గోల్డ్, డాలర్లు సీజ్
హైదరాబాద్: ఏ తల్లి అయిన తన పిల్లలు మంచి విద్యాబుద్ధులతో పెరిగి పెద్దవారై ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఆమె తన కొడుకులను దొంగలుగా తీర్చిద్దింది. చివరకు వారితోపాటు జైలుపాలయ్యింది.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ తల్లితోపాటు కొడుకులను కటకటాల వెనక్కి నెట్టారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టలో నివాసముంటున్న సనాబేగం అలియాస్ నజిమున్నీసా, ఆమె కుమారులు సయ్యద్ మహ్మద్, సయ్యద్ సాహిల్ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో 33 ఇళ్లల్లో దొంగతనాలు చేశారని తెలిపారు.

పోలీసులకు చిక్కకుండా 33 దొంగతనాలు
జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను సనాబేగం ఎంపిక చేస్తే... కుమారులిద్దరు రెండు, మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి వెనుక వంట గది లేదా పడక గది కిటీకీల గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లి చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసినా సంఘటన స్థలాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో 33 కేసుల్లోనూ వీరిని పట్టుకోలేదని కమిషనర్ వివరించారు. ఒక సీసీ కెమెరాలో ఫుటేజీ ఆధారంగా వీరు పోలీసులకు చిక్కారని చెప్పారు.

టీఆర్ఎస్ మహిళా నేతగా..
ఇది ఇలా ఉంటే.. కుమారులతో దొంగతనాలు చేయిస్తున్న సనాబేగం కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకొనేదని అంజనీకుమార్ తెలిపారు. చోరీలకు టోలీచౌకీ, గోల్కొండ, బంజారాహిల్స్ ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న భావనతో ఆమె, కుమారులు మూడేళ్ల క్రితం టోలీచౌకీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో గోల్కొండ, కార్వాన్, టోలీచౌకీ ప్రాంతాల్లో ఆమెను ఎవరూ అనుమానించేవారు కాదు. దీన్ని అవకాశంగా మలుచుకుని కుమారులతో దొంగతనాలు చేయిస్తోంది.

వచ్చిన డబ్బులతో జల్సాలు
దొంగసొత్తును తీసుకురాగానే.. చార్మినార్ వద్ద నూర్ జువెలర్స్ యజమాని మహ్మద్ నూరుద్దీన్కు ఇచ్చి డబ్బు తీసుకునేవారు. సనాబేగం పార్టీ నాయకురాలు కావడంతో ఆమె తెస్తున్న నగలపై నూరుద్దీన్కు కూడా అనుమానం రాలేదు. అతడి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత ముగ్గురూ విందులు వినోదాలు, జల్సాలు చేసుకునేవారు. గోల్కొండ టూంబ్స్ వద్ద ఎఫ్.ఎఫ్.గార్డెన్స్లో సయ్యద్ మహ్మద్ పుట్టిన రోజు వేడుక పేరుతో రూ.5లక్షలు ఖర్చుచేశారని అంజనీకుమార్ వివరించారు. ఒకే ఒక చిన్న ఆధారంతో పశ్చిమ మండలం ఇన్స్పెక్టర్ గట్టుమల్లు బృందం వీరిని అరెస్ట్ చేసిందన్నారు.

75లక్షలు, కిలోన్నర బంగారం స్వాధీనం
వీరి వద్ద నుంచి 1.65 కిలోల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, ఖరీదైన గడియారాలు, అమెరికన్ డాలర్లు సహా రూ.75లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాస్, డాక్టర్ రాధాకిషన్ రావు, ఇతర పోలీస్ అధికారులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఇళ్లు, పింఛన్ ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి సనాబేగం డబ్బులు వసూలు చేస్తుండడంతో ఆమెను గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్థానిక టీఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications