పార్టీ మార్పుపై త్వరలోనే.., వెంట వచ్చేవారు రావొచ్చు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే, తాను పార్టీ మారతానని మాత్రం ఆయన ఎప్పుడూ ప్రకటించలేదు. బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపైనా ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పుపై క్లారిటీనిస్తున్నాయి.

పార్టీ మార్పుపై త్వరలో స్పష్టతనిస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్య నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టతనిస్తానని చెప్పారు. గౌరవం ఇవ్వని చోట ఉండలేను. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయను. తగిన వేదిక ద్వారా కేసీఆర్ పై పోరాడుతా. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నన్ను నమ్మి వెంట వచ్చేవారు రావొచ్చు: రాజగోపాల్ రెడ్డి
అంతేగాక, తనను నమ్మినవారు తన వెంట రావొచ్చు అని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ. లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా రాజగోపాల్ రెడ్డి కూడా తలసానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే, ఈ విషయంలో తనకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మద్దతుగా నిలవలేదని రాగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎవరూ అండగా నిలవలేదని అసంతృప్తిలో కోమటిరెడ్డి
తమ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా నిలబడేది ఉండే కానీ, ఆయన అలా చేయలేదన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారం పక్షంతోపాటు తనది కూడా తప్పు అని అన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తన మాటలు రికార్డుల నుంచి తొలగించారని, అయితే, వారివి మాత్రం అట్లే ఉంచారని వాపోయారు. తన కోసం తమ సభ్యులు గట్టిగా నిలబడి ఉంటే ఎంత బలం ఉండేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భట్టి విక్రమార్క విషయంలో ప్రతీ అంశంలో అండగా ఉన్నామని, ఆయన మాత్రం తమను వదిలేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడితే.. తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే.. జీవన్ రెడ్డి తన స్థాయికి సరిపోడని అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా పార్లీ మార్పుపై సంకేతాలిచ్చారు. అంతేగాక, రాష్ట్ర పార్టీ నాయకత్వం వహిస్తున్న వారిపైనా విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై రాజగోపాల్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే పార్టీ మార్పుపై ఆయన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications