తెలంగాణ పతకాలు బీజేపీ,కాంగ్రెస్ అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.!మంత్రి మల్లారెడ్డి.!
వరంగల్/హైదరాబాద్: బీజేపి, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కౌరవుల నుండి దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని మొక్కుకున్నట్టు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేసారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుందని అన్నారు. చంద్రశేఖర్ రావును ప్రధానమంత్రిని చేయమని భద్రకాళీ అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. దేశాన్ని దోచిన దొంగలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో పేదలపై పన్నుల భారం మోపుతున్నదన్నారు మల్లారెడ్డి. మోడీ అంటేనే మోసాలు, నెంబర్ వన్ కేడీ అన్నారు.
బీజేపీ అంటేనే జూటా పార్టీ..
కుటుంబ పాలన కతంకరో అంటున్న మోడీ, తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని నిలదీసారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడని, రేవంత్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం కలలోకూడా జరగదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలని, కాంగ్రెస్, బీజేపీ లు దేశాన్ని నాశనం చేశాయన్నారు. విజయదశమి నాడు చంద్రశేఖర్ రావు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బయలు దేరుతారని అన్నారు. కేసీఆర్ దేశ్ కీ నేత ప్రధాని కావాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు.
దళిత బంధు అమలు చేసే దమ్ముందా?
తెలంగాణ రాష్ట్రాన్ని అధిగమించే సత్తా ఎవరికి లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేసే దమ్ముంది అని బీజేపీ పాలిత రాష్ట్రాలకు సవాల్ విసిరారు మల్లా రెడ్డి. దళిత బంధు పథకాన్ని బీజేపి అమలు చేస్తే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు మల్లా రెడ్డి. తెలంగాణలో అమలు చేస్తున్న పతకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాన్నారు కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి.
అభివృద్దిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు..
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. వీళ్లంతా నడమంతరపు దొంగలని, చెడగొట్టుడు గాళ్లని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు సంపూర్ణ మద్దతు ఇద్దామని పార్టీ నేతలకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు మల్లా రెడ్డి.
కేసీఆర్ దేశ్ కీ నేత..
చంద్రశేఖర్ రావు దేశ్ కీ నేత అవుతారని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కార్మికులకే ఇవ్వాలన్నారు. వివిధ శాఖల్లో తెలంగాణకు అవార్డులు మీద అవార్డులు వస్తున్నాయని, ఏ అవార్డు వచ్చినా అది పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకే వస్తున్నాయని, ఇందుకు సీఎం చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశంలో కష్ట పడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు మంత్రి మల్లా రెడ్డి.