గైర్హాజరికి చెక్: మాస్టారు సెలవు పెడితే ఎస్సెమ్మెస్ తప్పనిసరి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు మెరుగు పర్చేందుకు వివిధ శాఖలు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాయి. ఇవి సత్ఫతాలు ఇస్తుండటంతో క్రమేపీ అన్ని విభాగాలకు విస్తరిస్తున్నాయి.
వరంగల్: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు మెరుగు పర్చేందుకు వివిధ శాఖలు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాయి. ఇవి సత్ఫతాలు ఇస్తుండటంతో క్రమేపీ అన్ని విభాగాలకు విస్తరిస్తున్నాయి. కీలకమైన ప్రభుత్వ పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ అమలు చేయాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినా.. పాఠశాలల సంఖ్య వేలల్లో ఉండటం.. మౌలిక వసతులు లేకపోవడంతో ఇది కార్యాచరణ దాల్చడం లేదు. దీంతో విధులకు ఇష్టానుసారంగా హాజరయ్యే ఉపాధ్యాయులకు వరంగా మారింది.
సెలవు చీటి పెట్టినా.. పరస్పర అవగాహనతో మరుసటి రోజు హాజరు పట్టికల సంతకం చేసే సౌలభ్యం అనేక పాఠశాలల్లో ఉంది. దీన్ని నివారించడానికి సెలవు పెట్టిన రోజు సంక్షిప్త సందేశం తప్పనిసరి చేశారు. అనధికారిక గైర్హజర్లను అడ్డుకునేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఈ ఆదేశాలు ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఈ మధ్య చేపట్టిన తనిఖీల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం 78-85 శాతమే ఉన్నట్లు తేలింది. పరిస్థితులను స్వయంగా అంచనా వేసిన తనిఖీ బృందాల ప్రతినిధులు తమ సర్వేలో వెల్లడైన వాస్తవ అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అనధికారిక నిరోధానికి నిబంధనలు కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో మేల్కొన్న పాఠశాల విద్యాశాఖ ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దీని ప్రకారం ఉపాధ్యాయులు ఇక నుంచి సెలవు పెట్టాలనుకుంటే ప్రధానోపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయురాలికి సెలవు చీటి ఇవ్వడంతో పాటు మండల విద్యాధికారుల చరవాణికి సంక్షిప్త సందేశం పంపాల్సి ఉంటుంది.
తమకొచ్చిన సంక్షిప్త సందేశాలను ఎంఈవోలు క్రోడీకరించి జిల్లా విద్యాశాఖాధికారికి ఏరోజుకారోజు నివేదించాలి. ఈ విధానంతో నిత్యం ఎంతమంది ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారనేది తెలియడంతో పాటు గుట్టుచప్పుడు కాకుండా మరుసటి రోజు హాజరు వేసుకునే వారి ఆట కట్టవుతుంది. ఒకవేళ ప్రధానోపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయురాలు సెలవు ఉంటే వారు కూడా మండల విద్యాధికారికి సెలవు చీటి ఇచ్చి డీఈవోకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందించాలి.
కాస్తంత మేలు
సెలవు పెడితే సంక్షిప్త సందేశం పంపాలనే నిబంధనతో డుమ్మాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం లేకపోయినప్పటికీ పరిస్థితి కాస్తంత మెరుగుపడనుంది. ఉన్నతాధికారులు తనిఖీ చేసినప్పుడు ఎస్ఎంఎస్లతో గైర్హాజరైన ఉపాధ్యాయుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. పైగా కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాలు సమీపంలో ఉన్నందున అధికారుల సందర్శనలు పెరిగాయి. గతంలో జిల్లాకేంద్రం నుంచి డీఈవో బయలుదేరారని తెలుసుకొని సమీప గ్రామాల్లో నివసించే ఉపాధ్యాయులు హడావుడిగా పాఠశాలలకు వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం కూడా ఉండదు. పైగా సమాచారం తెప్పించుకున్నాకే తనిఖీకి వెళ్తారు కనుక బుకాయించేందుకు వీలు పడదు.