ఐటీ వార్: బెంగళూరుకు హైదరాబాద్ షాకిస్తుందా? టీ హబ్ మోడల్ (పిక్చర్స్)
హైదరాబాద్/బెంగళూరు: భారత ఐటీ రాజధానిగా కొనసాగుతోన్న బెంగళూరు.. మున్ముందు తన ప్రాభవాన్ని కోల్పోనుందా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనే పెట్టని ఆభరణాన్ని ఆ నగరం చేజార్చుకుంటుందా? మరిన్ని ఆకర్షణలతో హైదరాబాద్.. ఆ నగరానికి గండి కొట్టనుందా? అంటే అవుననే అంటున్నారు.
ఇటీవల కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ- ప్రపంచ బ్యాక్ సంయుక్తంగా ప్రకటించిన ఈవోడీబీ జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీలు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
టీ హబ్
బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక మాత్రం 13 స్థానానికి పడిపోయింది. గత ఏడాది వెల్లడించిన ర్యాంకుల్లో 9వ స్థానంలో నిలిచిన కర్ణాటక ఈసారి నాలుగు స్థానాలు దిగజారింది. ప్రస్తుతానికైతే ఐటీ ఎగుమతులు, సేవల్లో బెంగళూరు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే, ఈవోబీడీ ర్యాంకుల ప్రభావంతో అవకాశాలు చేజార్చుకోవచ్చంటున్నారు.
బెంగళూరుకు ధీటుగా టి హబ్
దీనికితోడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల భారీగా పెరిగిన అవినీతి, తద్వారా సంస్థలకు అనుమతులు మంజూరు చేయడంలో నెలకొన్న జాప్యం తదితర కారణాలు కూడా బెంగళూరుకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఐటీ రాజధాని ఉండి కూడా కర్ణాటక ఈవోబీడీ ర్యాంకుల్లో వెనుకబడిపోవడం షాకింగ్ అని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వి దేశ్ పాండే అభిప్రాయపడ్డారు.
ఐటీ పరిశ్రమ
బెంగళూరు నగరంలో పరిశ్రమలు విస్తరించినంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అప్ ప్రారంభించిన సోమ్ సింగ్ చెప్పుకొచ్చారు. బెంగళూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన కోరమంగళ్ నుంచి హెబ్బాల్ల మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో ఐటీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ బదులు వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్కు అలవాటుపడాల్సి వస్తోందన్నారు. ఇది సిటీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తుందంటున్నారు.
హైదరాబాద్ బెంగళూరు నుంచి పాఠాలు నేర్చితే..
ఒకవైపు హైదరాబాదులో టీ-హబ్ తరహా ఏర్పాట్లతో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా, కర్ణాటకలో మాత్రం చిన్న తరహా వ్యాపారాలకు అనుమతులు లభించడం కష్టంగా మారిందంటున్నారు. బెంగళూరు ఎదుర్కొంటున్న ఇబ్బందులనుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా పనిచేస్తే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అడ్రస్ హైదరాబాద్కు మారడం ఎంతో దూరంలో లేదని అంటున్నారు.