ఔటర్ ఘటనలో మృతిచెందిన టెక్కీకి ఇటీవలే పెళ్లి
హైదరాబాద్: విమానాశ్రయానికి వెళ్తుండగా మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తూ ట్రక్కును ఢీకోవడంతో ఓ క్యాబ్లో ఉన్న మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్కు తీవ్రగాయాలై మృతి చెందారు. రాజేంద్ర నగర్ పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన రజత్ భార్య నజియా సుల్తానా (30) గచ్చిబౌలిలో ఉంటూ అక్కడే ఇన్ఫోసిస్లో సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తోంది.
మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు క్యాబ్లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరింది. హిమయత్ సాగర్ వద్ద ముందుకెళ్తున్న ట్రక్కును డ్రైవర్ నాగరాజు గుర్తించలేక ఢీకొట్టాడు. వెనుక సీట్లో కూర్చున్న నజియా సుల్తానా తలకు తీవ్ర గాయాలయ్యాయి. నజియాను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ నాగరాజును గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం ఉదయం నాలుగున్నర గంటలకు జరిగింది. బాధితురాలు గచ్చిబౌలి నుండి శంషాబాద్కు క్యాబ్లో వెళ్తోంది. కాగా, పోలీసులు డ్రైవర్ బాలరాజు పైన కేసు పెట్టవచ్చునని తెలుస్తోంది. రాష్ డ్రైవింగ్ నేపథ్యంలో అతని పైన కేసు పెట్టవచ్చునని చెబుతున్నారు.
కాగా, రజియా సుల్తానాకు ఇటీవలే పెళ్లైంది. వారు కొద్ది రోజుల క్రితమే బెంగళూరు నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. రజియాకు ఇన్ఫోసిస్లో, ఆమె భర్తకు గచ్చిబౌలిలోని మరో ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం దొరకడంతో వారు హైదరాబాద్కు మారారు. రజియా సుల్తానా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.