సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా అయోధ్య, పుష్కరాల స్పెషల్: హాల్ట్ స్టేషన్లు.. !!
Secunderabad- Ayodhya, Yamuna Pushkaralu tourist special train: సికింద్రాబాద్ నుంచి అయోధ్య- వారణాశికాశీ- బైద్యనాథ్ ధామ్ పుణ్యక్షేత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. పూరీ- బైద్యనాథ్ ధామ్- ప్రయాగ్ రాజ్ వంటి ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. యమున పుష్కరాలు దీనికి అదనం. యమున పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం లభించింది.
భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 9 రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. జూన్ 3వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 160, 3ఏసీ- 490, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ కు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

తొలుత పూరీ జగన్నాథుడిని దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు చేయవచ్చు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. అనంతరం బైద్యనాథ్ ధామ్ కు వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. ఇక్కడ విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకునే వెసలుబాటు ఉంది. ఆ తర్వాత వారణాశి వెళ్తుంది. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ సందర్శనం కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది. సాయంత్రం గంగా హారతిని తిలకించవచ్చు.
దీని తర్వాత అయోధ్య. చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటుంది. యమున పుష్కాల సందర్భంగా అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే అవకాశం కల్పించింది ఐఆర్సీటీసీ ఈ టూర్ ద్వారా. ప్రయాగ్ రాజ్ సందర్శనతో ఈ టూర్ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,600 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,100, పిల్లలకు 24,800 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 34,100, పిల్లలకు 32,500 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.












Click it and Unblock the Notifications