కేసీఆర్ చెప్పిన బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమేనా? బీహార్ పర్యటనతో కొత్త చర్చ!!
తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన బిజెపి ముక్త్ భారత్ సాధ్యమవుతుందా? జాతీయ రాజకీయాలలో బిజెపి ని గద్దె దించడానికి చివరి నిమిషం వరకు పోరాటం చేస్తానంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సక్సెస్ అవుతారా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గతానికి భిన్నంగా బిజెపి బలాన్ని పుంజుకుని ముందుకు దూసుకుపోతుంటే, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించడం, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో మూడో సారి మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్, ఇదే సమయంలో దేశ రాజకీయాలలో వచ్చే లోక్సభ ఎన్నికలలో కీలక భూమిక పోషించాలని ప్రయత్నాలు సాగిస్తున్న తీరు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్న అంశాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాలను మార్చే దేశ్ కి నేత అవుతారని టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ కూడా బిజెపిని టార్గెట్ చేస్తూ దేశ రాజకీయాలను మార్చాలని తెగ తహతహలాడుతున్నారు. కెసిఆర్ ని మించిన రాజకీయ సీనియర్లు, దిగ్గజ నేతలు అనేక రాష్ట్రాలలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బిజెపి ని గద్దె దించడం కోసం కూటమిగా ఏర్పడవలసిన అవసరాన్ని ప్రతిపక్షాలకు పదే పదే చెబుతూ అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బాగా దెబ్బ తిన్న కాంగ్రెస్.. తెరమీదకు ప్రాంతీయ పార్టీలు
అయితే కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ చేసిన నినాదం దాదాపు వర్కౌట్ అయింది. చివరకు ఆ పార్టీ కేవలం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పరిస్థితికి వచ్చింది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు కూడా పార్టీ నుండి వరుసగా జారుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయేలా చేస్తుంది. ఇక పార్టీని వీడి వెళుతున్న వారంతా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి, రాహుల్ సారథ్య పటిమ పై 4 రాళ్ళు వేసి వెళుతుండటం కాంగ్రెస్ పార్టీని మరింత కష్టాల్లోకి నెడుతోంది. ఇక బీజేపీ ధాటిని, దాడిని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదని భావిస్తున్న సమయంలో, ఇతర రాష్ట్రాలలో బీజేపీ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ప్రాంతీయ పార్టీల నేతలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి ముక్త్ భారత్ అంటూ నినదిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలకు భయం .. అందుకే బీజేపీపై పోరాటానికి చర్చ
అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు వరుసలో నిలబడి పోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి ఇదే విషయంపై కేసీఆర్ చర్చించారు. బిజెపిని మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చెయ్యాలని ఇరువురు నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుతం బీజేపీ విస్తరిస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బ కొట్టిన మోడీ వ్యూహం వెరసి ప్రాంతీయ పార్టీల నేతలు ఎక్కడ తాము బిజెపి వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్నభయంతో కేంద్రంలోని బీజేపీపై పోరాటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ బీహార్ పర్యటనతో బీజేపీ ముక్త్ భారత్ పై చర్చ ... అందరిలో సయోధ్య కుదిరేనా?
అయితే సీఎం కేసీఆర్ అందర్నీ తాను ఏకం చేసి, కూటమిని ఏకతాటి మీద నడిపించి బిజెపిని టార్గెట్ చేయాలని భావిస్తున్నారు కానీ, అది అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు బీహార్లో తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన అద్దం పడుతుంది. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయడం, ఆయన తీవ్ర అసహనంతో కనిపించడం సీఎం కేసీఆర్ తీరును, బీహార్ సీఎం నితీష్ కుమార్ జీర్ణించుకోలేకపోతున్నారు అన్న చర్చకు కారణంగా మారింది.
కేసీఆర్ కు జై కొట్టి నడిచే రాష్ట్రాలు ఏవి? బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమేనా?
అంతెందుకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ తో కలిసి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు జై కొట్టి, ఆయనతో పాటు నడిచే రాష్ట్రాలు ఏవీ పెద్దగా కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దేశ్ కి నేత గా ఎలా ఎదుగుతారు? బిజెపి ముక్త్ భారత్ ఎలా సాధిస్తారు అన్నది ప్రస్తుతం అందరిలోనూ జరుగుతున్న ప్రధానమైన చర్చ.