నాయినికి సీటు ఉన్నట్టా..! లేనట్టా..! కొంప ముంచిన 10కోట్ల వ్యవహారం..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి. ప్రజా ప్రతినిధులా పదవులు అనుభవించిన వారిలో చాలా వరకు విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. పాత జిల్లాల ప్రకారం 10 జిల్లాలో ఏదో ఒక నాయకుడుకి ఎదురీత తప్పడంలేదని సంకేతాలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి, ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ రాములు, రంగా రెడ్డి లో మేయర్ రామ్మోహన్, హైదరాబాద్ లో కే.కేశవ రావు లాంటి నేతలకు పార్టీలో భంగపాటు ఎదురయ్యే అవకావాలు కనిపిస్తున్నాయి. తాజాగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీటు ఉంటుందా..? వచ్చే ఎన్నికలో పోటీ చేసే అవకాశం అదిష్టానం కల్పిస్తుందా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.
నాయిని సీటు పై ఎటూ తేల్చని అదిస్టానం..! 70ఏళ్ల వయసులో పెద్దాయనలో టెన్షన్..!!
సాక్షాత్తూ సీఎం తరువాత సీఎం.. హోమంత్రి.. ఆయనకే సీటు ఉంటుందా లేదా అనే బెంగపట్టుకుంది. దీనంతటికీ కారణమేదైనా.. డెబ్బై ఏళ్లు దాటిన వయసులో నాయిని రాజకీయంగా చలాకీగా ఉండటం విశేషం. తెలంగాణ హోంశాఖమంత్రి నాయిని నరసింహారెడ్డిపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమంలో కలిసి పనిచేసినందుకు కేసీఆర్ నాయినికి సముచిత స్థానం కల్పించారు. పైగా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు తెలియని పెద్దాయనకు హోంశాఖ అప్పగిస్తే సైలెంట్ గా తమ పనులు చక్కబెట్టుకోవచ్చనే ఆలోచన కూడా చంద్రశేఖర్ రావులో ఉండి ఉంటుంది. దాని ఫలితమే, రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట వేశానంటూ చెప్పుకునే అవకాశం దక్కించుకున్నారు గులాబీ బాస్.
మంత్రిగా నాయిని కి ఒరింగిందేమీ లేదు..! అంతా బాస్ కనుపన్నల్లోనే..!!
నాలుగున్నరేళ్ల పాలనలో మంత్రులు తమ పెత్తనం చాటుకున్నదీ లేదు. కనీసం బదిలీలకు పదవిని.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నదీ లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు స్వయంగా నాయిని బహిరంగ వేదికలపై మాట్టాడారు. పైగా రెడ్లకు ప్రాధాన్యత లేదంటూ పెదవి విరిచారు కూడా. కానీ, ఆయన మేనల్లుడు శ్రీనివాసరెడ్డి మాత్రం సైలెంట్గా పనులు చక్కబెడుతూ బాగానే కూడబెట్టారనే అపవాదులున్నాయి. కార్పొరేటర్గా గెలిచిన ఆయన అంతకుముందే సెటిల్మెంట్లు.. వసూళ్ల పర్వంతో బాగానే చెలరేగాడనే చర్చ కూడా ఉంది.
తన అల్లుడి సంగతి దేవుడెరుగు..! ఇప్పుడు తనకే సీటు గోయిందా అనే పరిస్థితి..!!
ముషీరాబాద్ అసెంబ్లీ సీటు తన మేనల్లుడికి కేటాయించాలంటూ నాయిని తానే స్వయంగా గులాబీబాస్ వద్ద విన్నవించాడు. అయితే తొలి జాబితాలో అల్లుడు, మామ ఏ ఒక్కరి పేరు కనిపించలేదు. రెండో జాబితాలో దాదాపు లేనట్టే అనే సంకేతాలు వచ్చాయి. ముఠాగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్టుగానే సమాచారం. దీంతో నాయిని ఆ సీటు తనకైనా కేటాయించమంటూ మొరపెట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో మరో చిక్కులముడిలో చిక్కారు నాయిని నర్సింహారెడ్డి.
నాయిని వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం..! విశ్రాంతినిచ్చే దిశగా ప్రణాళికలు..!
కేసీఆర్ తనకు 10కోట్లు ఆఫర్ ఇచ్చారంటూ చెప్పటమే దీనికి కారణం. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఇది నజరానా అంటూ చెప్పకనే చెప్పారు. అటువంటి సమయంలోనే వద్దన్న కేసీఆర్ ఇప్పుడు 2018లో విజయం ఊగిసలాడుతున్న వేళ కోట్లు సంగతి ఎలా ఉన్నా.. ఓట్లు పడని నాయినికి సీటిచ్చి తప్పుచేస్తారా. పోనీ మేనల్లుడికి ఇద్దామంటే.. అవినీతి ముద్ర పరాకాష్టకు చేరింది. మేయర్ బొంతు రామ్మోహన్కు సీటు లేదంటూ, ఇప్పుడు కార్పొరేటర్గా అసెంబ్లీ కేటాయిస్తే ఎలా అనే సందేహం కూడా లేకపోలేదు. ఇటువంటి వేళ నాయిని హస్తం గూటిలోకి చేరతారనే ప్రచారం సాగుతుంది. దీనిపై నాయిని స్పందిస్తూ తాను కేసీఆర్ కోటరీలోనే ఉంటానంటూ తెగేసి చెబుతున్నారు. మరి ఈ మాటకు ఎంత వరకూ కట్టుబడి ఉంటారనేది కాలమే నిర్ణయించాలి.