దేశవ్యాప్త పేలుళ్లకు కుట్ర: భత్కల్ తర్వాత.. భారత్లో ఐసిస్ ఉందా లేక ఐఎస్ఐ ఉందా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత్లో భారీ ఎత్తున పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు ఐబీ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాదులో 4గుర్ని అరెస్ట్ చేసి, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
ఇటీవల ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. మన దేశం నుంచి కూడా కొంతమంది ఐసిస్ పట్ల సానుభూతితో ఉన్నారు. వీరిపై పోలీసులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారు. ఐసిస్, ఐఎస్ఐ సంస్థలు భారత్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐఎస్ఐ.. ఐసిస్లా మన దేశంలో ఆపరేట్ చేస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. పలుచోట్ల పోలీసులు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
తరిచి చూస్తే.. ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ప్రధానంగా ఆన్ లైన్ పైన ఆధారపడి, దాని ద్వారానే అట్రాక్ట్ చేస్తుంది. 'ఒంటరి తోడేళ్ల' ద్వారా దాడులకు ప్రాధాన్యతనిస్తుంది.
పోలీసులు మొదటిసారి.. 2015లో రత్లాంలో ఐసిస్ ఉగ్రవాదులను గుర్తించారు. తద్వారా కొంతమంది యువత ఐసిస్ వైపు ఆకర్షితులవుతున్నారని గుర్తించారు.
రెండు రోజుల క్రితం పోలీసులు ఉత్తరాఖండ్లో నలుగురిని అరెస్టు చేశారు. అందులో అక్లాక్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ అజిమ్ ఉషాన్, మొహమ్మద్ ఒసామా అలియాస్ ఆదిల్, మొహమ్మద్ మెహ్రాజ్ ఉన్నారు. తాము ఐసిస్ విధేయులుగా వారు చెప్పారు.
అయితే, విచారణలో మాత్రం వారికి ఐసిస్తో సంబంధాలు లేవని తేలినట్లుగా తెలుస్తోంది. వారు ఇండియన్ ముజాహిద్దీన్లో భాగమని, వారు ఐఎస్ఐ సూచనల ప్రకారం నడుచుకుంటున్నారని తేలింది.
యాసిన్ భత్కల్ అరెస్టు అనంతరం.. మూడేళ్ల క్రితం ఇండియన్ ముజాహిదీన్ రెండుగా చీలిందని తెలుస్తోంది. రియాజ్ భత్కల్ నేతృత్వంలోని గ్రూప్ ఐసిస్కు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. చీలిపోయిన మరో గ్రూపుకు షఫీ అర్మార్ నాయకుడిగా తెలుస్తోంది. అతడి గ్రూప్ పేరు అన్సార్ ఉల్ తవిద్. అన్సర్ ఐఎస్ఐ నుంచి దూరం జరిగి ఐసిస్ అనుకూలుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.