30లోపు కూటమిలో సీట్ల కేటాయింపు: కేసీఆర్పై జానారెడ్డి ఫైర్, ఆ డబ్బు టీఆర్ఎస్ శ్రమదానమా: బీజేపీ
హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి నేతృత్వంలో మదింపు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని తేలనుంది. టీడీపీకి పదిహేను నుంచి ఇరవై సీట్లు, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితికి 3 సీట్లు ఖరారు చేసే అవకాశముంది. ఇతర పార్టీలకు 30కి పైగా సీట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ నెల 30వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఖరారు అవుతుందని జానారెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మహాకూటమి ద్వారా పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారన్నారు. ఇది కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
పవన్ కళ్యాణ్! మా బతుకు మేం బతుకుతాం: వీ హనుమంత రావు, కేసీఆర్కు జైపాల్ సవాల్
2014లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడిన కేసీఆర్ ముందస్తుకు వెళ్లారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయ సాధిస్తుందన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్నారు: కిషన్ రెడ్డి
ఆచరణ సాధ్యం కాని హామీలతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలను ఏ రకంగా అమలు చేస్తారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకే నాలుగున్నరేళ్ల పాలనలో దిక్కులేదని, కేసీఆర్ మళ్లీ పాక్షిక మేనిఫెస్టో పేరుతో కొత్త హామీలు ఇవ్వడం విడ్డూరమన్నారు.
ఓట్లు, సీట్ల కోసం ఉచిత హామీలివ్వడం బీజేపీ విధానం కాదని చెప్పారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పెంచేలా తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పన్నిన వలలో కేసీఆర్ చిక్కుకున్నారన్నారు. హైదరాబాద్లో లక్ష ఇళ్ల నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నిధుల విషయంలో ప్రధాని మోడీ ఇంటి నుంచి ఇస్తున్నారా? అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మరి కేసీఆర్ ప్రకటించిన హామీలకు నిధులు వారి ఇంటి నుంచి ఇస్తున్నారా లేక శ్రమదానం చేసి ఇస్తారా అని ఎద్దేవా చేశారు.