రాజమండ్రి తొక్కిసలాట చంద్రబాబు వైఫల్యమే: జానారెడ్డి ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో 27 మంది భక్తులు మృతిచెందడం ముమ్మాటికి ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి ఆరోపించారు. మంగళవారం జానారెడ్డి భద్రాచలంలో గోదావరి పుష్కర స్నానమాచరించారు.
అనంతరం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారాహిత్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని జానారెడ్డి విమర్శించారు. రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటన దురదృష్టకరమని అన్నారు.
ఏపీ ప్రభుత్వం భక్తులకు సౌకర్యం కల్పించడంలో, రద్దీని క్రమబద్దీకరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఈ సంఘటనకు బాధ్యత వహించే అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నామని తెలిపారు.
అన్యాయంపై పోరాటం: ఎంపి కవిత
తెలంగాణకు జరిగే అన్యాయంపై పార్లమెంట్ను స్తంభింపజేస్తామని టిఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై పార్లమెంట్లో గళమెత్తుతామని పునరుద్ఘాటించారు. కేంద్రం తెలంగాణకు కేటాయించే నిధుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.