ముఖ్యమంత్రి పదవి నాదే, ఇప్పటి దాకా అలాగే ఉన్నా: జానారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో (2019) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి పదవి చేపడతానని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాను సీఎంతో సమాన హోదా కలిగి ఉన్నానన్నారు.
దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు.

తెరాస వెన్నుపోటు: మల్లు రవి
విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపు ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. పేద ప్రజల పైన రూ.1800 కోట్ల భారం మోపిందన్నారు. కాంట్రాక్టర్లకు, ధనవంతులకు, వ్యాపారులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
ప్రాధాన్యత లేని పనులకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ధరలు పెంచడం విడ్డూరమన్నారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలపై వెంటనే తగ్గాలని సూచించారు. లేదంటే తెలంగాణవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
రేపటి నుంచి రేవంత్ దీక్ష
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు సంఘీభావంగా తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం నుంచి నిరాహారదీక్ష చేయనున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో రెండు రోజుల పాటు ఆయన దీక్ష చేయనున్నారు.
భూసేకరణ చట్టప్రకారం నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కదానిని కూడా నెరవేర్చడం లేదన్నారు.












Click it and Unblock the Notifications