టిడిపిలో చేరిన జయసుధ: చంద్రబాబుపై ప్రశంసల జల్లు
విజయవాడ: సినీ నటి, మాజీ శానససభ్యురాలు జయసుధ తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడకు వచ్చి ఆమె పార్టీ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టిడిపిలో చేరారు. చంద్రబాబుతో సమావేశమైన తర్వాత ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని, హైదరాబాద్ను హైటెక్సిటీగా మార్చి యువతకు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుదేనని జయసుధ కొనియాడారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన జయసుధ శనివారం క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
తెలుగువారందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో టీడీపీలో చేరానని, హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని జయసుధ చెప్పారు. ఇక క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని ఆమె చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం దైవ నిర్ణయమని ఆమె అన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ మారినట్లు జయసుధ చెప్పారు. చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుస్తానని అన్నారు. తెలుగు మాట్లాడేవారందరికీ తానేమిటో తెలుసునని అన్నారు. బంధుత్వపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తనకు అనుబంధం ఎక్కువని చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందనే ధీమాను ఆమె వ్యక్తం చేసారు. టిడిపి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
గత ఎన్నికల్లో తెలంగాణ సికింద్రబాదు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరి, 2009 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు.
అప్పటి నగర మేయర్, కాంగ్రెసు నేత బండ కార్తిక రెడ్డితో ఆమెకు తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి ఆ విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. కానీ, విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల పట్ల ఆమె వైరాగ్యం ప్రదర్సించారు.