కెసిఆర్కు కోదండరాం భయం: జీవన్ రెడ్డి, ‘సర్కారు పునాదులు కదిలాయి’
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, మంత్రులు విమర్శలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోదండరాం అంటే తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావుకు అంత భయమెందుకని ప్రశ్నించారు.
కోదండరాం వ్యాఖ్యలను ప్రభుత్వం సలహాగా స్వీకరించాలే గానీ, ప్రతి విమర్శలు చేయకూడదని హితవు పలికారు. ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా కోదండరాంను జేఏసీ కన్వీనర్గా నియమించుకున్నామని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రంలో పౌరహక్కులు ఉన్నాయా? లేవా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తిచూపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని చెప్పారు. సకలజనుల సమ్మె వంటి పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు.
రాష్ట్ర మంత్రులందరూ కలిసి కోదండరాంపై ఎదురుదాడి చేయడం సరికాదని, ఇది అమరులనే కించపర్చేలా ఉందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా జేఏసీ నడవాలా? అని జీవన్ రెడ్డి నిలదీశారు.
కెసిఆర్ ప్రభుత్వ పునాదులు కదిలాయి: మల్లు రవి
'తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన వ్యక్తి కోదండరాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. కోదండరామ్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ సర్కార్ పునాదులు కదిలాయని రవి చెప్పుకొచ్చారు. అందుకే టిఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కోదండరామ్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో కోదండరామ్ తెలంగాణలో అన్నివర్గాలను ఏకం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాలనపై కోదండరాం మాట్లాడిన దాంట్లో తప్పేంటి? అని ప్రశ్నించారు. కోదండరాం ప్రజల పక్షాన మాట్లాడారని ఆయన తెలిపారు. కోదండరాంపై మాటల దాడి తెలంగాణ ప్రజలపై దాడేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.