అమ్మాయిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి: చెన్నై ముఠా పట్టివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. మార్కండేయకాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న పెంచికలపేటకు చెందిన గోషిక శిరీషపై అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విఠల్నగర్కు చెందిన కోయ శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం కళాశాలలో బయట నిలబడిన ఉన్న శిరీషను నీతో మాట్లాడేది ఉందని పక్కకు పిలిచి తనను ప్రేమించాలని కోరాడు.
శిరీష నిరాకరించడంతో ఆకస్మాత్తుగా బ్లేడ్తో దాడికి ప్రయత్నించాడు. శిరీష అప్రమత్తమై చేయి అడ్డుపెట్టడంతో అరచేతికి తీవ్ర గాయమైంది. వెంటనే కళాశాల నిర్వాహకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శిరీష చేతికి ఏడు కుట్లు పడ్డాయి. శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా వేదిస్తునాడన్ని శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళాశాలలోనే కాగితాలు కట్ చేసే బ్లేడ్తో గాయపరిచేందుకు దాడికి పూనుకున్నాడు.
దొంగల ముఠా పట్టివేత
చెన్నైకు చెందిన దొంగల ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40లక్షల విలువైన 1.350కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైరా పోలీస్సబ్డివిజన్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో డీఎస్పీ బి.రాంరెడ్డి వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన దొంగల ముఠా ఖమ్మం, వరంగల్, కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల్లో పలు దొంగతాలు చేశారు. వీరిపై ఆయా జిల్లాల్లో 38కేసులు నమోదయ్యాయి.
సోమవారం ఉదయం రాష్టీయ ప్రధాన రహదారిపై కొణిజర్ల సమీపంలో సమీపంలో మధిర సీఐ నూనె వెంకటేశ్వర్లు, కొణిజర్ల ఎస్ఐ కరుణాకర్లు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వచ్చిన వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని విచారించారు. దాంతో చోరీల వ్యవహారం బయటపడింది. దాంతో ముఠా సభ్యులైన రాజామణికణన్ ప్రకాష్, మణిమాల, విజయశక్తిలను అరెస్టు చేశారు. ఈ ముఠాకు ప్రకాష్ నాయకత్వం వహిస్తునాడు.
గతనెల 24వతేదీన పల్లిపాడు వద్ద పొలానికి వెళ్లిన మేడా సరస్వతీ అనే మహిళ మెడలోని గొలుసును తెంచుకొనివెళ్లేందుకు ప్రయత్నించిన కేసులో ఈ ముఠాకు చెందిన వెంకటేశ్వర్లు అనే నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచారం ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 1.354 కిలోగ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ , కరీంనగర్ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చోరీకి గురైన ఆభరణాల వివరాలను ఆయన వెల్లడించారు.