నేడు 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు: 9న 11 వేల మందికి ఇస్తామన్న రేవంత్
ఉద్యోగ నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్లపాటు ఉంచారని మండిపడ్డారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన 'కొలువుల పండగ'కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తులో ఇంజినీర్లది కీలక పాత్ర అని అన్నారు. 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ ఇంజినీర్ల చేతుల మీదుగానే నిర్మాణం కాబోతున్నాయన్నారు. ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం కాబోతున్నాయని రేవంత్ తెలిపారు. 55 కి.మీ మూసీ రివర్డెవలప్ మెంట్ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామన్నారు.

మరోవైపు కేసీఆర్పై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పానని.. తాను చెప్పినట్లే కేసీఆర్ ఉద్యోగం పోయిందని, ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు లేక.. లక్షలాది మంది యువత నిరాశలో మునిగిపోయారన్నారు.
నిరుద్యోగుల వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 9న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు అంటూ బీఆర్ఎస్ గత పాలనపై విమర్శలు గుప్పించారు. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుందామన్నారు.












Click it and Unblock the Notifications