'కెసిఆర్కు రాహుల్ భయం, అందుకే తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్'
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి భయపడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యోగాల ప్రకటన చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం నాడు విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో 15వేల ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పైన ఆయన మాట్లాడారు. రాహుల్ పర్యటనకు భయపడే ఈ ప్రకటన వచ్చిందన్నారు. వాస్తవానికి 15వేల ఉద్యోగాలు కాదని, లక్ష ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వాలన్నారు.
ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు అని చెప్పిన వారు ఇప్పుడు పదిహేనువేల ఉద్యోగాలతో సరిపుచ్చడం విడ్డూరమన్నారు. ఈ విషయంలో విద్యార్థి ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు.
శుక్రవారం నాడు అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
కాంగ్రెస్ పర్యటనపై శ్రీనివాస్ గౌడ్
రాజకీయ ఉద్దేశ యాత్రల వలన జిల్లాకు ఉపయోగం లేదని, ఏడాది కాలంలో పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్యటనతో ఉపయోగం ఏమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
కెసిఆర్ మండిపడ్డ ఎర్రబెల్లి
రాష్ట్రంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న పనులు కేవలం కెసిఆర్ కొడుకు, కూతురు, అల్లుడు లాభాల కోసమేనని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమ్మెలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.
ఉప్పల్లో ఎమ్మెల్యే మూడు రోజులుగా మున్సిపల్ కార్మికుల కోసం దీక్ష చేస్తున్నారు. ఆయనను ఎర్రబెల్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్మికుల ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని, వేతనాలు పెంచుతామని చెప్పిన కెసిఆర్.. అధికారంలోకి వచ్చాక వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.