జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసు.. ఇంకా దొరకని ఆచూకీ.. తండ్రి స్నేహితుల పనేనా ?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ కుమారుడు ఓ తొమ్మిది సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కథ ప్రస్తుతం పోలీసులకు సవాల్ విసురుతోంది. ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్ రెడ్డి అనే బాలుడి ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది.
కిడ్నాప్ కు గురైన కుసుమ దీక్షిత్ రెడ్డి ని వదిలి పెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు.

ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేసి 45 లక్షలు డిమాండ్
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలుడు తల్లికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్ చేసిన అగంతకుడు మళ్లీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫోన్ చేసి డబ్బులు సిద్ధం చేస్తున్నారా అని ప్రశ్నించారు. రేపు మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసారని చెప్పి తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. అయితే ఆ ఇంటర్నెట్ కాల్ ను ట్రాక్ చేయడం కోసం జిల్లా ఐటీ కోర్ విభాగం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ నుండి వచ్చిన నలుగురు సభ్యుల సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా పరిశీలిస్తున్నారు.

పోలీసులకు సవాల్ గా కిడ్నాప్ కథ .. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా పర్యవేక్షణ
సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించినా బాలుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
అయితే తన కుమారుని దగ్గర వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని బాలుని తండ్రి రంజిత్ తాను అనుమానిస్తున్న పట్టణానికి చెందిన ఐదుగురు పేర్లను చెప్పాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. తండ్రి రంజిత్ తనకు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారని , తనతో చాలాసార్లు చూసిన వ్యక్తి కావడంతోనే బాబు అతడు రమ్మనగానే బయటికి వెళ్లి వుంటాడని అంటున్నారు.

తమకు తోచినంత డబ్బిస్తాం .. బాబును వదిలిపెట్టమని తల్లిదండ్రుల విజ్ఞప్తి
పోలీసులు కూడా ఇదే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.
ప్రస్తుతం పట్టణంలో నాలుగు బృందాలు దీక్షిత్ రెడ్డి కోసం గాలిస్తున్నాయి. దీక్షిత్ రెడ్డి తో ఆడుకున్న పిల్లలకు కొందరు అనుమానితులను ఫోటోలను చూపించినా వారు కాదని చెప్పడం గమనార్హం. కిడ్నాపర్ డిమాండ్ చేసిన 45 లక్షల రూపాయలు కాకుండా తమకు తోచినంత డబ్బు ఇస్తామని, బాబుకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఎక్కడైనా వదిలిపెట్టండి అంటూ బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
జర్నలిస్ట్ కొడుకు కావటంతో కేంద్ర హోం శాఖకు జర్నలిస్ట్ సంఘాల విజ్ఞప్తి
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకుంటామని వారంటున్నారు. మరోపక్క పోలీసులు ఈ కిడ్నాప్ కథను తేల్చడానికి బాలుడు దీక్షిత్ రెడ్డిని సురక్షితంగా తీసుకొని రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కిడ్నాప్ కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన జర్నలిస్టు కుసుమ రంజిత్ రెడ్డి కుమారుడు కావడంతో జర్నలిస్టు సంఘాలు కేంద్ర హోం శాఖకు కూడా కిడ్నాపర్ల చెరనుంచి బాలుడిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications