కమ్మ సమ్మేళనానికి కెసిఆర్ ప్లాన్: పాత మిత్రులంతా టిడిపికి షాకిస్తారా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపిని నామరూపాల్లేకుండా చేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో టిడిపికి అండగా ఉంటూ వస్తోన్న వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కమ్మ సామాజికవర్గం సమావేశం నిర్వహించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు దీపావళి పర్వదినం లోపుగా తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలతో తెలంగాణ సిఎం కెసిఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నట్టు కన్పిస్తోంది.
తెలంగాణ ఉద్యమం కారణంగా తెలంగాణలో టిడిపి తీవ్రంగా నష్టపోయింది. టిడిపికి చెందిన ముఖ్యమైన నాయకులు టిఆర్ఎస్లో చేరారు. కొందరు నాయకులు టిడిపిలోనే కొనసాగుతున్న వారి అనుచరగణం ఇతరపార్టీల్లోకి వలసవెళ్ళింది.
టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం కూడ పార్టీకి నష్టం వాటిల్లుతోందని కొందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.
ఈ అవకాశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అనుకూలంగా ఉపయోగించుకొంటున్నారు.తెలంగాణకు చెందిన ముఖ్యమైన నేతలు టిడిపి నుండి టిఆర్ఎస్లో చేరేలా ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.
కమ్మ సామాజికవర్గంపై కెసిఆర్ దృష్టి
తెలంగాణలో కమ్మ సామాజిక వర్గంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రీకరించారు. 2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం టిఆర్ఎస్ వైపుకు మొగ్గు చూపితే మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారు. ఇందులో భాగంగానే కెసిఆర్ ఇటీవల పరిటాల శ్రీరామ్ వివాహనికి హజరయ్యారని సమాచారం. అంతేకాదు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావును టిఆర్ఎస్లో చేర్చుకోవడం వెనుక ప్రధాన కారణం కూడ ఇదేననే అభిప్రాయం టిఆర్ఎస్ వర్గాల్లో లేకపోలేదు. అయితే కమ్మ సామాజికవర్గంలో టిఆర్ఎస్ పట్ల విశ్వాసాన్ని కల్పించేందుకు గాను దీపావళి కంటే ముందే కమ్మ సమ్మేళనం ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు.ఈ సమావేశంలో కమ్మ సామాజికవర్గానికి ఏ రకమైన హమీలు కావాలనే దానిపై చర్చించనున్నారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
ఏపీకే టిడిపిని పరిమితం చేయాలని కెసిఆర్ వ్యూహం
తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం చేయాలనే వ్యూహంతో కెసిఆర్ ఉన్నారని సమాచారం.తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దిశగా పావులు కదుపతున్నారు. 2014 ఎన్నికలకు ముందే ఈ వ్యూహంలో సగం వరకు కెసిఆర్ విజయం సాధించారు. అయితే 2109 ఎన్నికల నాటికి తెలంగాణలో టిడిపిని లేకుండా చేయాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ అధినేత అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావుపై టిఆర్ఎస్ నజర్
టిడిపిలో కెసిఆర్ ఉన్న సమయంలో ప్రస్తుతం టిడిపిలో ఉన్న కొందరు ముఖ్య నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు అత్యంత సన్నిహితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రస్తుత తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు కెసిఆర్కు సన్నిహితులు. 2009 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్తో పొత్తుకు ఈ మిత్రులే కారణమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.అయితే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలతో పాటు, నిజాయితీగా ఉంటారని మండవ వెంకటేశ్వర్రావుకు పేరుంది. అయితే ఈ తరుణంలో మండవ వెంకటేశ్వర్రావు 2009 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుండి టిడిపి తరపున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ప్రస్తుతం మండవ వెంకటేశ్వర్రావును టిఆర్ఎస్లో చేరాలని టిఆర్ఎస్ నుండి ఒత్తిడి ఉందని సమాచారం. ఈ మేరకు పార్టీకి చెందిన సీనియర్లకు కెసిఆర్ బాధ్యతలను అప్పగించారని సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉండాలని 2004 ఎన్నికలకు ముందు నుండి మండవ భావిస్తున్నారు. అయితే కొన్ని కారణాలతో 2009లో పోటీ చేశారు.
బలమైన నాయకుల కోసం కెసిఆర్ వ్యూహం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో ఎక్కువ మందికి ప్రజల్లో మంచి పేరు లేదనే అభిప్రాయం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు ఉందని సమాచారం.దీంతో ఇతర పార్టీల్లో బలమైన నేతలుగా ముద్రపడినవారిని టిఆర్ఎస్లోకి లాగేందుకు కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా బలమైన నేతలు, సామాజికవర్గాల వారీగా కెసిఆర్ ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై కేంద్రీకరించారని సమాచారం.
బలమైన కమ్మ సామాజిక వర్గం నేతల కోసం కెసిఆర్ ప్లాన్
తనతో పాటు బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉండాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఏరికోరి కమ్మ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతల కోసం వల వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు తెలంగాణలో ప్రధానమైన ఇతర సామాజికవర్గాల నేతలపై కూడ కెసిఆర్ దృష్టి కేంద్రీకరించారు.