బాబుతో ఇప్పించే దమ్ముందా, రూ.కోటి ఇస్తా: కడియం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒప్పించి రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన విద్యుత్ వాటాలను ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సవాల్ విసిరారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, లోయర్ సీలేరు ప్రాజెక్టుల నుండి రావాల్సిన 54 శాతం విద్యుత్ వాటాను చంద్రబాబుతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించలేని టీడీపీ నాయకులు 12న చంద్రబాబును వరంగల్ పర్యటనకు ఏ ముఖం పెట్టుకొని తీసుకు వస్తారన్నారు.
తెరాస ప్రభుత్వం చంద్రబాబుకు లేఖ రాస్తే ఆయన కాళ్లు పట్టుకొని అయినా రాష్ట్రానికి విద్యుత్తును తెస్తానని ఓ టీడీపీ నాయకుడు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. తెరాస ప్రభుత్వం చంద్రబాబును భిక్షం అడగటం లేదన్నారు. మనకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించే అడుగుతోందన్నారు.
భూకబ్జాలపై...
వరంగల్లో తాను భూ కబ్జాకు పాల్పడినట్టు నిరూపిస్తే రూ.కోటి నజరానా ఇస్తానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. హన్మకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో తాను గానీ, తనకుటుంబ సభ్యులు గానీ వరంగల్ జిల్లాలోనే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనుభూకబ్జాలకు పాల్పడలేదన్నారు.
అలా పాల్పడినట్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ చానెళ్లు ఏవైనా పరిశోధానత్మకంగా, విశ్లేషణాత్మక జర్నలిజం ద్వారా ఆధారాలతో సహ నిరూపించినట్లయితే తనవద్ద డబ్బులు లేకపోయినా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొనైనా రూపాయి, రూపాయి కూడబెట్టి రూ. కోటి నజరానాగా ఇస్తానని ప్రకటించారు. విలువలకు కట్టుబడి, నీతి నిజాయితీతో ప్రజా జీవితంలో పనిచేస్తున్న తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ఆరోపణలు వద్దన్నారు.