కడియం శ్రీహరి ఛలో కాళేశ్వరం.. కేసీఆర్ అసలు సిసలు బాహుబలి ,కాంగ్రెస్ , బీజేపీలు కడియం తిట్లకు బలి
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు అన్న వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి తన ఉనికిని, కెసిఆర్ పట్ల ఉన్న స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరుతో నేడు చలో కాళేశ్వరం అంటూ ప్రాజెక్టు సందర్శన చేస్తున్న కడియం శ్రీహరి కేసీఆర్ నిజమైన బాహుబలి అని పొగడ్తల వర్షం కురిపించారు. కాంగ్రెస్ , బీజేపీలపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు,సన్నాసులన్న కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సారధ్యంలో వరంగల్, మడికొండ వద్ద వాహనాలకు జెండా ఊపి వందలాది వాహనాల్లో కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన వేలాది మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కాళేశ్వరం సందర్శన యాత్రను ప్రారంభించారు.ఇక ఆయన అక్కడ పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ , బీజేపీలపై విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినంత తిట్టిపోశారు.సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్లా అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు .

ఏసీబీ, సీబీఐ, ఈడి కేసుల్లో ఇరుక్కుని జైళ్ళ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు అంటూ ఎద్దేవా చేసిన కడియం శ్రీహరి
ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులు కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నిసిగ్గుగా తినేసి, జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు పీక్కు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఏసీబీ, సీబీఐ, ఈడి కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ ఈ కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతి పై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకే అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్రన్న కడియం శ్రీహరి శతాధిక వృద్ధురాలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంపశయ్య పై ఉందని పేర్కొన్నారు.

బీజేపీనేతలకు తెలంగాణలో ఓట్లడిగే హక్కు లేదన్న మాజీ మంత్రి కడియం
ఇక బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ ఉలికి, ఉలికి పడుతోందని ఆయన పేర్కొన్నారు . గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీజేపీ ఉందా అని అడుగుతున్నానన్న ఆయన అసలు బీజేపీకి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కే లేదన్నారు . నరేంద్రమోదీ నాయకత్వం లో గత 5 ఏళ్లలో తెలంగాణ కి ఒరగబెట్టింది ఏమి లేదని మండిపడ్డారు . ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వమని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పార్టీ బీజేపీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కి నిధులు ఇవ్వకుండా, రాష్టాన్ని పట్టించుకోకుండా ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ లో అసలు సిసలు బాహుబలి కేసీఆర్ అంటూ కితాబు
ఇక టీఆర్ ఎస్ పార్టీ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుందని పేర్కొన్న ఆయన నూనూగు మీసాల నవ యవ్వనంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని కితాబిచ్చారు.ముసలితనం సంతరించుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఇపుడే అడుగులు వేస్తున్న బీజేపీ నవ యవ్వనంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తో పోటీ పడలేవని తేల్చిపారేశారు. తెలంగాణ లో అసలు సిసలు బాహుబలి కేసీఆర్ అంటూ కేసీఆర్ ను ఆకాశానికెత్తారు .గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్తున్నామని పేర్కొన్న కడియం శ్రీహరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం అని కొనియాడారు.

అపరభగీరధుడు కేసీఆర్ అని ప్రశంసల వర్షం కురిపించిన కడియం శ్రీహరి
అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరధుడు అని ఆయన చేసిన ప్రయత్నాన్ని చూడాలని, అన్నదాతలకు నీటి కొరత తీర్చే ఆపన్నహస్తం కాళేశ్వరం అని కొనియాడారు. ప్రపంచంలో ని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పుకొచ్చారు . కాళేశ్వరం ప్రాజెక్టు కు 82 వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయంలో ఇప్పటి వరకు 53వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా తొలి లబ్ది పొందే జిల్లా వరంగల్ జిల్లా అన్న కడియం శ్రీహరి
ఈ ప్రాజెక్టు ద్వారా తొలి లబ్ది పొందే జిల్లా వరంగల్ జిల్లా అన్నారు కడియం శ్రీహరి. ఇప్పటికే మిడ్ మానేరుకు నీరు చేరిందని, తరవాత లోయర్ మానేరుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. మిడ్ మానేరు లో 25 టీఎంసీ ల నీరు, లోయర్ మానేరు లో 25 టీఎంసీ ల నీరు నిండి ఇక్కడి పొలాలు సస్యశ్యామలం అవుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ లో 22 జిల్లాలకు నీరు అందించే తెలంగాణ వర ప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు కడియం శ్రీహరి . ప్రపంచంలో నే తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పిన కడియం శ్రీహరి కాళేశ్వరం సందర్శన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications