ఆ తప్పు సరిదిద్దుకోవడానికే వచ్చా.. అందుకే ఈ యుద్ధం: కేసీఆర్పై కవిత ఫైర్!
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పేరుతో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత భావోద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా సంస్కృతిని కాపాడామని, బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేశామని గుర్తుచేసుకున్నారు. అయితే స్వరాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ప్రజల కలలు సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందని, గతంలో పాలించిన తన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో తాను సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఇసుక మాఫియా వంటి దారుణాలు జరిగాయని ఆమె అంగీకరించారు.
కేసీఆర్ ఒక మరబొమ్మ.. ఆయన మన మనిషి కాదు..
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కవిత మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రస్తుతం "గుంటనక్కల చేతిలో చిక్కుకున్నారని", ఆయన తన రాజకీయ పరిపక్వతను కోల్పోయారని విమర్శించారు. ఒకప్పుడు చేనేతల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రజల ఇళ్లు కూల్చేస్తుంటే బాధితులను ఆదుకోవడానికి బయటకు రావడం లేదని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఒక 'మరమనిషి' (రోబో) లా మారారని, ఆయన మన మనిషి కాదని, అందుకే తాను యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆమె ధ్వజమెత్తారు.

అవినీతి పందికొక్కులే పక్కన ఉన్నారు - పార్టీ నుంచి పంపడంపై క్లారిటీ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి పక్కన పెట్టారని కవిత సంచలన ఆరోపణ చేశారు. తనను బయటకు పంపి, అవినీతికి పాల్పడిన 'పందికొక్కులను' కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా, తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు 'అమ్మ'గా మారి వారి కష్టాలను తీర్చడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుందని, అందుకే రాజకీయ పార్టీగా ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు - రెండేళ్లలో అధికారమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను 'కర్కోటక పాలన'గా కవిత అభివర్ణించారు. రాష్ట్రంలో మూడు నెలల పసికందు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, మరో రెండేళ్లలో తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జాగృతి ద్వారా ఉద్యమానికి సాంస్కృతిక పునాది వేసినట్లే, ఇప్పుడు టీఆర్ఎస్ ద్వారా రాజకీయంగా మార్పు తీసుకువస్తానని కవిత పిలుపునిచ్చారు.
పాంచజన్యం పూరించిన కవిత
మూడు పార్టీలపై ఐదు ప్రధాన అంశాల ఎజెండాతో పాంచజన్యం పూరించనున్నట్లు కవిత వెల్లడించారు. ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ, స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ఈ ఐదు అంశాల ఆధారంగా పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్లాలని కవిత దిశానిర్దేశం చేశారు. పాంచజన్యం పూరించనున్నట్లు స్పష్టం చేశారు.
పాంచజన్యం ఇదే..
*విద్య - గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంతే పవిత్రంగా చూస్తాం, ఎంత వరకూ చదివినా సరే ఉచితంగా చదివిస్తాం
*వైద్యం - ఉచితంగా వైద్యం ఇస్తాం
*వ్యవసాయం- రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తాం. 24 గంటలూ నాణ్యమైన కరెంట్ అందిస్తాం
*ఉపాధి- యువతకు రూ2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు
*సామాజిక న్యాయం-అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం.












Click it and Unblock the Notifications