కామారెడ్డి రైతుల పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం: నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం.. అందుకే!!
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు అంటూ కామారెడ్డి జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పర్వాన్ని కొనసాగించారు.
కామారెడ్డిలో రైతుల పోరాటం.. కౌన్సిలర్ల రాజీనామాలు
నెలన్నర రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు విభిన్న రూపాలలో తమ నిరసనలు తెలియజేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్ లు నిర్వహించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతుగా విలీన గ్రామాల కౌన్సిలర్లు 9 మంది రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ డెడ్లైన్ విధించింది. ఇక ఇప్పటికే బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్ కు పంపించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ల పైన కూడా ఒత్తిడి పెరగడంతో వారు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి నిర్ణయంతో మున్సిపల్ అత్యవసర సమావేశం
ఇక ఇదే సమయంలో ఈరోజు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అమలును వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు చర్చించి నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే ముసాయిదా రద్దును తీర్మానించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేడు మున్సిపల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు నేడు తీర్మానం
ఈ మేరకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జాహ్నవి ఈ విషయాన్ని వెల్లడించారు. నేడు కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు జాహ్నవి వెల్లడించారు. ఢిల్లీ కన్సల్టెన్సీ తయారుచేసి పంపించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయనున్నట్టు తెలిపారు. మున్సిపాలిటీ తీర్మానం చేసి పంపిన మాస్టర్ ప్లాన్ వేరు.. ఢిల్లీ నుంచి వచ్చిన మాస్టర్ ప్లాన్ వేరని రైతులకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఆమె వెల్లడించారు.
రైతులకు నష్టం చేసే పని ప్రభుత్వం చెయ్యదన్న మున్సిపల్ చైర్ పర్సన్
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలకు 60 రోజులకు సమయం ఇవ్వడం జరిగిందని, మొత్తం 2,396 అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసే పని చేయదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కూడా రైతులకు సంబంధించిన ఒక ఎకరం భూమిని కూడా తీసుకోమని, స్పష్టం చేశారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.