ఘోర రోడ్డు ప్రమాదం: టైరు పేలడంతో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, చిన్నారి సహా ఐదుగురు మృతి
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా మాచారం మండలం ఘన్పూర్(ఎం) గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉ్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంబవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
కని పెంచి పెద్ద చేసిన తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన తండ్రినీ విచక్షణారహితంగా కర్రతో కొట్టాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తల్లి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గోవిందాపూర్ గ్రామానికి చెందిన మైసయ్య, పోశవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. వీరి చిన్న కుమారుడు గతంలో జరిగిన ఓ ప్రమాదంలో చనిపోయాడు. పెద్దకొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. మైసయ్య తనకున్న 3 గుంటల భూమిని విక్రయించాడు. వచ్చిన డబ్బులో బాలమల్లుకు లక్ష రూపాయలు ఇచ్చి, మరో లక్ష రూపాయలను తన వద్ద ఉంచుకున్నాడు. కాగా, ఆ డబ్బు కూడా తనకే కావాలంటూ బాలమల్లు.. తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరముందని మైసయ్య చెప్పినా బాలమల్లు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రుల ఇంటికి వచ్చి మళ్లీ గొడవపడ్డాడు. తల్లిని తీవ్రంగా కొట్టి, ఆమె దగ్గర ఉన్న డబ్బులను లాక్కున్నాడు. అనంతరం తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన తండ్రిపై కూడా కర్రతో దాడి చేశాడు. అప్రమత్తమైన గ్రామస్తులు దంపతులిద్దరినీ 108 లో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.