కవిత ఆందోళన, రైతు కుటుంబమేనన్న క్రికెటర్ ఓఝా, జ్వాలా చెక్కు (పిక్చర్స్)
హైదరాబాద్: గత పాలకుల తప్పిదాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతన్నలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి ఇటీవల పిలుపునిచ్చింది.
దీనికి స్పందన వచ్చింది. దేశ, విదేశాల్లో ఉన్న చాలా మంది రైతు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లి నసీమా మీర్జాలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు సమాజానికి ఇది మంచి సంకేతం కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు విద్యుత్, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేయగలిగిందన్నారు. ఇప్పటి వరకు 252 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
జాగృతి ఇచ్చిన పిలుపునకు స్పందించి తెలంగాణ జాగృతి అమెరికా శాఖ 20, లండన్ శాఖ 20, కువైట్, బహ్రెయిన్ శాఖ 10, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య కన్వీనర్ అనంతుల ప్రశాంత్ కుటుంబం 10, ముంబయి శాఖ 5, జాగృతి సంస్థ ఉపాధ్యక్షులు రాజీవ్సాగర్ 5, జాగృతి వరంగల్ కన్వీనర్ కోరబోయిన విజయ్ 5, ఇతరులు మరో 5కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. మొత్తం 80 కుటుంబాలకు జాగృతి తరఫున దత్తత తీసుకుంటున్నారు.
తెలంగాణ జాగృతి
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి ప్రకటించిన ఈచ్ వన్ - అడాప్ట్ వన్ కార్యక్రమం నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఒకటో తేదీన ఆ కుటుంబాల చేతుల్లోకి ఆర్థిక సాయం అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దత్తత స్వీకరణకు విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనకు తెలంగాణ వికాస సమితి కో ఆర్డినేటర్ ఆచార్య శ్రీధర్ కన్వీనర్గా ఒక కమిటీని, ఆచార్య కోదండరాం, దేవీప్రసాద్, విజయ్ బాబు తదితరులతో అడ్వయిజరీ బాడీని నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
తెలంగాణ జాగృతి
రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సినీ, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు ముందుకొస్తున్నారని కవిత తెలిపారు. ఆర్థిక సాయం అందించేందుకు నవంబర్ 1వ తేదీని నిర్ణయించుకున్నందున ఈలోగా మిగిలిన 30 రోజుల సమయాన్ని మార్గదర్శకాల రూపకల్పన, అదేవిధంగా ఆ కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు తెరవడం, జాగృతి అకౌంట్తో అనుసంధానించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ జాగృతి
వారం, పది రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడిస్తామన్నారు. రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఇక ముందు ఆత్మహత్యలు జరగకుండా చూడాలనేది జాగృతి లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా ఎప్పటికప్పుడు రైతుల్లో ఆత్మస్థయిరాన్ని నింపడం, వారికి అండగా నిలవడం, వ్యవసాయంలో వస్తున్న ఆధునిక విధానాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతామని చెప్పారు.
తెలంగాణ జాగృతి
ప్రజ్ఞాన్ ఓఝా మాట్లాడుతూ... 'నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతుల బాధలు నాకు తెల్సు. మా కుటుంబంలో పెద్దలు 20-25 కిలోమీటర్లు నడిచి పొలాలకు పోయేవారు. అలాంటి రైతులు కష్టాల్లో ఉన్నపుడు అందరూ వారికి అండగా నిలవాల్సిన అవసరముంది. మీకు మేమున్నాం... అనే భరోసా వారిలో కల్పించాలి. రైతు కుటుంబాల్ని ఆదుకునేందుకు కవిత చొరవ అభినందనీయం. ఆమెతో కలిసి పని చేసేందుకు నేను ముందుకొచ్చాను. నా వంతు సహకారాన్ని ఆ కుటుంబాలకు అందిస్తా.' అన్నారు.
తెలంగాణ జాగృతి
గుత్తా జ్వాలా మాట్లాడుతూ... 'ఈ దేశ పౌరురాలిగా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆదుకునేందుకు ముందుకు రావాలి. దేశంలో వ్యవసాయ రంగం అనేది చాలా కీలకమైనది. రైతులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వారికి మనమందరం అండగా నిలవాలి. రైతు చనిపోయినపుడు వారి పిల్లలు అనాథలవుతారు. వారికి విద్య, మంచి భవిష్యత్తు అందించాల్సిన అవసరముంద'ని అన్నారు.