కేసీఆర్ దత్తత గ్రామాన్నే ఉద్ధరించే దిక్కులేదు.. బీఆర్ఎస్ తో దేశాన్నే మారుస్తారా?
దేశంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించి, జాతీయ రాజకీయాలను చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ను బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి టార్గెట్ చేశారు. సీఎం కెసిఆర్ దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు కానీ భారతదేశాన్ని నడిపిస్తాం అంటూ బీఆర్ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని విజయశాంతి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం అధోగతిలో ఉంది
సీఎం కేసీఆర్ రెండేళ్లక్రితం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారని, కానీ ఆ ఊరిని ఇప్పుడు అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. ఇంతవరకు వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని విజయశాంతి పేర్కొన్నారు. కొత్త లేఅవుట్ లో గ్రామంలో ఉన్న మొత్తం ఐదు వందల డబ్భై కుటుంబాలకు రెండు వందల గజాల చొప్పున స్థలంలో ఇళ్ళు నిర్మిస్తామని ప్రకటించి రోడ్డు నిర్మాణం కోసం కొందరు ఇళ్ల కూల్చివేతకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
అక్కడ సర్కార్ చేసిందేమీ లేదు.. గ్రామస్తులకు ఏ పని చెయ్యాలన్నా అనుమతులు రావు
ఇక ఇప్పటి వరకు ఊరి ప్రజలకు నూతన గృహాలు ఇస్తామని చెప్పిన సర్కార్ అవేవీ చేయలేదని, గ్రామస్తులు సొంత ఇల్లు కట్టుకుందామని భావించినా అనుమతులు కూడా ఇవ్వడం లేదని విజయశాంతి పేర్కొన్నారు. గ్రామంలో కొన్ని పాత ఇళ్ళు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మలేక తామే స్వయంగా ఇల్లు కట్టుకుందామని భావించిన వారికి అనుమతులు రాక నిరాశ ఎదురవుతుందని విజయశాంతి తెలిపారు.
ఇక గ్రామంలో సెంట్రల్ లైటింగ్, అంగన్వాడి కేంద్రం, సిసి రోడ్లు, బడి భవనం, పంచాయతీ ఆఫీస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సుందరీకరణ, చెరువుల పునరుద్ధరణ పనుల కోసం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారని కానీ ఇప్పటివరకు వేటికీ నిధులు రాలేదని విజయశాంతి తెలిపారు.
ఇటీవల గ్రామసభ కూడా గందరగోళంగా..కేసీఆర్ నిర్వాకం
మరీ ముఖ్యంగా నూతన లేఅవుట్లలో 200 గజాలలో ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పగా, అంతకన్నా ఎక్కువ స్థలం ఉన్న వారు ప్రభుత్వానికి అప్పగించారని, ఇక ఎక్కువ స్థలం ఇచ్చిన వారి పరిహారం సంగతి ఏమిటి అన్న విషయాలపై ఎవరూ మాట్లాడడం లేదని, అంత మౌనంగా ఉన్నారని విజయశాంతి పేర్కొన్నారు. ఇక పాత ఇళ్లను కూల్చి, కొత్త ఇళ్లను నిర్మిస్తే పునరావాసం సంగతేమిటో తెలియదని పేర్కొన్న విజయశాంతి, తాజా పరిణామాలతో ఇటీవల నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది కేసీఆర్ నిర్వాకం అంటూ వాసాలమర్రి గ్రామ పరిస్థితిని కళ్ళకు కట్టారు.
ఆ గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి స్వయంగా దత్తత తీసుకున్న ఊరికి దిక్కులేని పరిస్థితుల్లో దేశానికి ఇంకేం చేస్తారు ఊహించుకుంటేనే భయంగా ఉందంటూ విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తెలంగాణ రాజకీయ పరిస్థితులను సర్వనాశనం చేసి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేని ఒక దుర్మార్గపు వ్యవస్థను మీ డబ్బుతో, అధికారంతో సృష్టించే ప్రయత్నం చేస్తూ, ఇక ఆగదు ప్రయత్నాలను జాతీయ స్థాయిలో కూడా చెల్లుబాటు చేద్దామని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పేరుతో మీరు చేస్తున్న ప్రయోగాలు నిష్ప్రయోజనం
బి ఆర్ ఎస్ పేరుతో మీరు చేస్తున్న ప్రయోగాలు నిష్ప్రయోజనం అవుతాయని విజయశాంతి తెలిపారు. దేశంలోనే అత్యంత డబ్బు కలిగిన రాజకీయ నేతగా, అహంభావంతో కెసిఆర్ చేస్తున్న పనులన్నిటినీ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉందని పేర్కొన్న విజయశాంతి సరైన సమయంలో తీర్పు చెప్పి తీరుతుందన్నారు.