బంపర్ ఆఫర్: విద్యుత్ ఉద్యోగులకు కెసిఆర్ వరాలు, ప్రమోషన్లు, రెగ్యులరైజేషన్
విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలు ప్రకటించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 24 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలు ప్రకటించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 24 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.మరో వైపు కొత్తగా 17వేల మంది ఉద్యోగులను నియమిస్తామని చెప్పారు.
తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గురువారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు. విద్యుత్ ఉద్యోగులపై ఆయన వరాల జల్లు కురిపించారు.
విద్యుత్ శాఖలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను పూర్తి చేయాలని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
మరోవైపు అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న 24 వేల మంది ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. జూన్ మాసం వేతనం రెగ్యులరైజ్ అయిన వేతనంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతాంగానికి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఉద్యోగుల ప్రమోషన్లకు అవసరమైన డిపిసి వెంటనే పూర్తి చేయాలన్నారు. డిపిసిలో అవసరమైతే మార్పులు చేర్పులు చేయాలని కూడ ఆయన సూచించారు.