కేసీఆర్కు దేశమంతా ఒక ఎత్తు.. ఏపీలో రాజకీయం మరో ఎత్తు; ఎందుకంటే!!
మొన్నటి వరకూ తెలంగాణ సెంటిమెంటుతో, టిఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాలు చేసి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశ రాజకీయాలు చేయాలని రంగంలోకి దిగిన కేసీఆర్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ కు అది సాధ్యం అవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందా? ప్రధానంగా కెసిఆర్ ను ఇబ్బంది పెట్టే ఏపీ సమస్యలు ఏంటి? పక్కా తెలంగాణ వాదం ఉన్న కేసీఆర్ ను ఏపీ ప్రజలు ఆదరిస్తారా? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.

ఏపీ రాజకీయాలు కేసీఆర్ కు అంత ఈజీ టాస్క్ కాదు
ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంత ఈజీ టాస్క్ కాదు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు సొంత ప్రాంత ప్రయోజనాలను రక్షించడంలో భాగంగా పనిచేస్తాయి. ఇక జాతీయ పార్టీలు గా మారిన వేళ తమ విధానాలను మార్చుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి రైతు అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కెసిఆర్ వెళ్ళటం ఒక ఎత్తు అయితే, పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కెసిఆర్ చేసే ప్రయత్నానికి మధ్య ఖచ్చితంగా వ్యత్యాసం ఉండితీరాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణా నావల్లే వచ్చింది అంటున్న కేసీఆర్ ను ఏపీ ప్రజలు ఆదరిస్తారా?
ఏపీ తెలంగాణ వేరు కావడాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇక తెలంగాణా తెచ్చింది నేనే అని కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. విభజన ఇష్టపడని ఏపీ ప్రజలు ఇప్పుడు తెలంగాణా నా వల్లే వచ్చిందని చెప్పుకునే కేసీఆర్ అక్కడకు వెళితే ఆదరిస్తారా? అన్నది ప్రశ్నార్ధకమే. గతంలో కేసీఆర్ ఏపీ వెళ్ళినప్పుడు, లేదా పుట్టినరోజు, పండుగలకు కేసీఆర్ ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చెయ్యటం ఇప్పుడు రాజకీయ పార్టీగా వెళ్తే ఓటు బ్యాంకుగా మారుతుందా అన్నది కూడా ప్రశ్నే.

విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అనేక పరిష్కారం కాని వివాదాలు..
అంతే కాదు ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ రాష్ట్రంగా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కాలేదు. ఇంకా విభజన పంచాయతీలు అలాగే ఉన్నాయి. 9, 10 షెడ్యూల్ లోని సంస్థలు విభజన, ఆస్తుల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదాలు పరిష్కారం కాలేదు. అంతేకాదు ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలపైన రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు అలాగే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అలా ఉండగానే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏపీలో రాజకీయాలు చేయడానికి సై అంటున్నారు.

ఏపీలో కేసీఆర్ ముందు అన్నీ సవాళ్లే
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసే క్రమంలో కెసిఆర్ ఈ అన్ని సమస్యలపై సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ప్రకటించి చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్, పార్టీలో చేరిన నేతలెవరూ పార్టీని బలంగా ముందుకు తీసుకు వెళ్ళగలిగిన నేతలు కాకపోవడం ప్రధానంగా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ నందరిని పార్టీలో చేర్చుకుని కేసీఆర్, వారి తో ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతారా అన్నది ప్రశ్నార్థకమే. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ దూకుడుగా ముందుకు వెళుతుందని చెబుతున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయితీలను ముందే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.

ఏపీలో కేసీఆర్ అడుగుపెడితే జరిగేదిదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ అడుగుపెడితే ప్రధాన పార్టీల నుండి ముఖ్యంగా ఈ వివాదాలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నలు ఉత్పన్నం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా కెసిఆర్ నిర్ణయాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనానికి గురి అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా తెలంగాణకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు ఉంటే ఏపీ ప్రజలు కెసిఆర్ ను ఆదరిస్తారనే నమ్మకం లేదు. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న వివాదాలు పరిష్కారం కాకపోవడంతో పాటు, పక్కా తెలంగాణ వాదంతో రాజకీయాలు చేసే కెసిఆర్ ను ఏపీ ప్రజలు అంతగా ఆదరిస్తారా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ అడుగుపెడితే ఎదురయ్యే సవాళ్ల విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications